ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ. వేలాది మెడికల్ సీట్లతో ఒక్కొక్కటి డాక్టర్ల ఫ్యాక్టరీ. పేదింటి బిడ్డలు నామమాత్రపు ఫీజుతో డాక్టర్ పట్టా పుచ్చుకునే అవకాశం దొరికింది.
సామాన్యుడికి చేరువైన సేవల దృశ్యం ఇది ఆరోగ్య మౌలికవసతుల్లో అద్భుతం
లక్షలు కుమ్మరిస్తే కానీ అందని వైద్య విద్య ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు ఎక్కడికక్కడే ఉచితంగా లభిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపునకు మచ్చుతునక ఇది. ఆయన కార్యదక్షత ఇప్పుడు రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చింది. మెడికల్ టూరిజానికి కేరాఫ్ చేసింది.
దేశ వైద్యరంగంలో ఇది నవీన చరిత్ర! తెలంగాణలో తెల్లకోటు విప్లవం!
Medical education | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశ వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ వరుసగా రికార్డులు సృష్టిస్తున్నది. నిరుడు ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈసారి ఏకంగా 9 కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. 15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏమూల ఎవరికి ఏ కష్టం వచ్చినా హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కయ్యేవి. వందల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చేది. సకాలంలో వైద్య సదుపాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. ఉద్యమ సమయంలో ఇవన్నీ కండ్లారా చూసిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టిసారించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తూనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్నవి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీని ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నది. అంటే దాదాపు ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండే కాలేజీలు. అవి.. ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు జిల్లాల్లోనే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఏకంగా ఒకేసారి 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానుండడం దేశ వైద్యవిద్య రంగంలోనే సరికొత్త చరిత్ర కానున్నది.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది కొత్త కాలేజీలతో కలిపి ఆ సంఖ్య 3,790కి పెరిగింది. వచ్చే ఏడాది మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 4,590కి పెరుగుతుంది. అంటే.. 9 ఏండ్లలోనే ఐదున్నర రెట్లు పెరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014 నాటికి 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఈ ఏడాదితో 8,340కు పెరిగాయి.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాదు.. ఉక్కు సంకల్పంతో తొమ్మిదేండ్లలోనే దానిని సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. ఆయనకు తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతోపాటు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్పై స్పష్టమైన విజన్ ఉన్నది. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా స్పెషాలిటీ వైద్య సేవలు పేద ప్రజలకు చేరువ చేశారు. తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చారు. మెడికల్ సీట్లను అనేక రెట్లు పెంచడం ద్వారా దేశంలో తెల్లకోటు విప్లవం తీసుకొచ్చారు. తెలంగాణకు సీఎంగా కేసీఆర్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది.
– హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
5 రాష్ట్ర ఏర్పాటుకు ముందు..
గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ మెడికల్ కాలేజీ(1959), రిమ్స్ ఆదిలాబాద్ (2008), నిజామాబాద్ మెడికల్ కాలేజీ(2013)
29 తెలంగాణ ఏర్పాటు తర్వాత..
2016-17
మహబూబ్ నగర్, సిద్దిపేట
2018-19
నల్లగొండ, సూర్యాపేట
2022-23
మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి
2023-24
కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ
2024-25 (మంజూరుచేసినవి)
జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి