యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తాయిలాల బాటపట్టింది. లీడర్లు, ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో పైసలనే నమ్ముకొన్నది. నియోజకవర్గంలోని నేతలకు ఇచ్చేందుకు వందల సంఖ్యలో కార్లు, బుల్లెట్ బండ్లు ఆర్డర్లు పెట్టింది. ఇప్పటికే పలువురికి అందజేసినట్ట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరికొందరికి నగదు అప్పజెప్పనున్నట్టు సమాచారం. కిందిస్థాయిలో క్యాడర్ లేని బీజేపీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కుటిలబుద్ధిని ప్రదర్శిస్తున్నది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు ఉంటరో, పోతరో తెలియని స్థితిలో గిఫ్టుల ఎర వేస్తున్నది.
స్థాయిని బట్టి కానుక
మునుగోడులో నాయకులను మూడు స్థాయిలుగా వర్గీకరించుకొన్నారు. మొదటి స్థాయి నాయకుల కోసం 500 ఇన్నోవా క్రిస్టా, బ్రిజా కార్లను బుక్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు కీలక నేతలకు కార్లు ఇచ్చా రు. మర్రిగూడ మండలానికి చెందిన ఓ నేతకు కారు ఇచ్చినప్పటికీ.. కార్యకర్తలకు అనుమానం రాకుండా పాత కారునే వాడుతున్నట్టు తెలిసింది. రెండో స్థాయి లో ఉన్న లీడర్ల కోసం 500 బుల్లెట్ బండ్లు బుక్ చేసి రెడీగా ఉంచారు. మూడో స్థాయిలో ఉండే క్రియాశీలక కార్యకర్తలకు రూ.25 వేలు ఇవ్వనున్నట్టు సమాచారం. పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న వారికి మాత్రం మొండిచెయ్యి చూపించినట్టు తెలుస్తున్నది.
5 లక్షల నుంచి కోటి దాకా!
ఒకప్పుడు రాజకీయాల్లో విలువలు ఉండేవి. మాజీ ప్రధాని వాజ్పేయి ఒక్క ఓటుతో ప్రధాని పదవిని కోల్పోయిన సందర్భం కూడా ఉన్నది. ఇప్పుడు అదే పార్టీలో అడ్డగోలుగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. రాజగోపాల్రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నేతలను పశువుల్లా కొనేస్తున్నారు. వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు వలసలకు ప్రోత్సహిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.కోటి దాకా డబ్బులు ముట్టజెబుతున్నారని చర్చించుకొంటున్నారు. ప్రస్తుత ఉప ఎన్నికలో కార్యకర్త పార్టీ కండువా కప్పుకొంటే కూడా డబ్బులు ఇస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.15 వేల దాకా ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్నారు.