కొండాపూర్, జూలై 22: డిగ్రీ పట్టాలు పుచ్చుకొ న్న విద్యార్థులు వేతనాలు, ప్యాకేజీల వెంట పరుగెత్తొద్దని నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి సూచించారు. హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ-హెచ్ 22వ స్నాతకోత్సవం శనివారం గచ్చిబౌలిలో అట్టహాసంగా సా గింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంజినీర్లు అంటే సమస్యలను పరిష్కరించే వారని చెప్పారు. మనుషులు, గ్రహం, శ్రేయస్సు, శాంతి అనే నాలుగు స్తంభాలు మానవాళికి ముఖ్యమని వివరించారు. టెక్నాలజీ వాడి గ్రహా న్ని రక్షించే ప్రయత్నం చేయాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని సూచించారు.
9 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్
గవర్నర్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజ్రెడ్డి, ట్రిపుల్ ఐటీ-హెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్తో కలిసి కైలాశ్ సత్యార్థి విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా 519 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 9 మందికి గోల్డ్మెడల్స్ను అందజేశారు.
పరిరక్షణలో ఆదర్శనీయం: కైలాశ్ సత్యార్థి
మహిళలు, పిల్లల పరిరక్షణతో పాటు వారి అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శనీయంగా ఉన్నదని కైలాశ్ సత్యార్థి కొనియాడారు. డీజీపీ కార్యాలయంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాల వల్ల గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని కొనియాడారు. అనంతరం కైలాశ్ సత్యార్థిని డీజీపీ అంజనీకుమార్ ఘనంగా సన్మానించారు.