రామగిరి, జూన్ 24 : స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు సర్కార్ బడులకు కార్పొరేట్ వైభవం తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాది ప్రవేశాల సంఖ్య పెరుగుతూపోతుంది. ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో ఆయా పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంతో పాటు సకల వసతులు అందుబాటులోకి వచ్చాయి. సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పన ఇలా ప్రతీది అందుబాటులోకి రావడంతో కార్పొరేట్, ప్రైవేట్కు దీటుగా సర్కార్ బడులు దర్శనమిస్తున్నాయి.
ఎఫ్ఎల్ఎన్తో మెరుగైన విద్య ..
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల బలోపేతం దిశగా గత సంవత్సరం తొలిమెట్టు కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. దీంతో గుణాత్మక విద్య, ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఈ విద్యా సంవత్సరం సహితం తొలిమెట్టు కొనసాగనున్నది. పర్యవేక్షణకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గెజిటెడ్ హెడ్మస్టార్స్ను నోడల్ అధికారులుగా నియమించారు. వీరంతా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో నిత్యం ఎఫ్ఎల్ఎన్ అమలు తీరును పరిశీలన చేయడంతో పాటు సూచనలు చేశారు. దీంతో విద్యార్థులు చదువులో గణనీయ వృద్ధి సాధించారు. అలాగే ఆంగ్లమాద్యమం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
తొలిమెట్టు టీఎల్ఎంకు మంత్రి అభినందన..
నల్లగొండలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఉపాధ్యాయులు తయారు చేసిన ‘టీఎల్ఎం’(టిచర్ లెర్నింగ్ మెటీరియల్)ను ప్రదర్శించారు. దీన్ని ప్రారంభించి తిలకించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇలాంటి అంశాలతో పాఠాలు చెప్పడం లేదని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారనడానికి ఇదే దర్పణం పడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
3 నుంచి 17 వరకు కొనసాగిన బడిబాట
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 17 వరకు బడిబాట కొనసాగింది. ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, సీఆర్పీలు, ఎస్ఎంసీ చైర్మన్లు ఇంటింటికీ తిరుగుతూ సర్కార్ బడిలో వసతులను వివరించారు. దీంతో ప్రైవేట్ బడులకు పంపాలనే తమ పిల్లలను సర్కార్ బడికి తల్లిదండ్రులు పంపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడిబాటలో 22, 697మంది నూతన అడ్మిషన్లు తీసుకున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ప్రైవేట్ బడుల నుంచి విద్యార్థులు సర్కార్ బడిలో చేరారు. అలాగే అంగన్వాడీల నుంచి సహితం సర్కార్ బడిలోనే తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్పించారు.
ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాలు
మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడితో సర్కార్ బడిలో కార్పొరేట్కు దీటుగా సకల సౌకార్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వర్క్బుక్స్, హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. మరోవైపు వారంలో మూడు రోజులు కోడిగుడ్డుతో సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
ప్రవేశాలు పెంచేలా ఉపాధ్యాయుల కృషి..
ఫ్రభుత్వ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పెంచేలా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు బడిబాట కా ర్యక్రమంతో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు కృషి చేశారు.ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం పాఠశాలల బలోపేతాని కి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ను, సౌకర్యాలను వివరిస్తున్నారు.
రేపటి నుంచి రెండో విడుత బడిబాట..
ఫ్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా ఈ నెల 26 నుంచి జూలై 6 వరకు పాఠశాల విద్యా ఆధ్వర్యంలో రెండో విడుత బడిబాట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయులు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. అంగన్వాడీలతో పాటు బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలన్నారు.
సర్కార్ బడిలోనే చదువు బాగుంది
ప్రైవేట్ కంటే సర్కార్ బడుల్లోనే సదువు బాగుంది. నేను విద్యాశాఖ సమగ్ర శిక్షలో ఉద్యోగిగా పనిచేస్తున్నా. మాది నల్లగొండ మున్సిపాలిటీలోని కత్తాల్గూడ. అయినప్పటికీ నా కొడుకును మా ఊరి ప్రాథమిక పాఠశాలలో చదివిస్తున్నా. ఇక్కడ ప్రైవేట్ కంటే ఉపాధ్యాయులు మంచిగా చదువు చెబుతున్నారు. గతేడాది నా కొడుకు మంచి మార్కులు సాధించడంతో ఇటీవల నిర్వహించిన విద్యాదినోత్సవంలో నాకు ఉత్తమ పేరెంట్ అవార్డు సహితం విద్యాశాఖ అందజేసింది. వేలకు వేలు ఫీజు కట్టి ప్రైవేటులో చదివించేదానికంటే సర్కార్ బడుల్లోనే పిల్లలను చదివించాలి.
– రొయ్య లక్ష్మి, విద్యార్థి తల్లి, కత్తాల్గూడ,నల్లగొండ మండలం
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడితో సర్కార్ బడుల రూపురేఖలు మారాయి. అంతే కాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి పిల్లవాడికి ఉదయం రాగి జావ అందిస్తున్నారు. ప్రభుత్వ బడికి వచ్చే విద్యార్థులను సర్వతోముఖభివృద్ధిగా తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయడమే లక్ష్యంగా విద్యాశాఖ పనిచేస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఫ్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి విడుత బడిబాటలో 12, 675 నూతన అడ్మిషన్లు అయ్యాయి. రెండో విడుతలో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ