(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ముఖ్యం గా చిన్నారులపై ఆకృత్యాలు నిత్యకృత్యంగా మారా యి. రాష్ట్రంలో రోజూ సగటున ఆరు పోక్సో కేసులు నమోదవ్వడమే ఇందుకు ఉదాహరణ.
ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)-2024 నివేదిక తేల్చి చెప్పింది. 2024లో రాష్ట్రంలో 2,103 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసుల రేటులో జాతీయ సగటు(9 శాతం)ను మించి తెలంగాణలో 15 శాతం నమోదయ్యింది. పోక్సో కేసులు అత్యధికంగా నమోదవుతున్న టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
ఇక, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. దక్షిణాది రాష్ర్టాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా తెలంగాణ మారింది. 2023లో మహిళలపై 23,678 నేరాలు జరుగగా.. 2024 నాటికి ఇది 24,495కు పెరిగింది. మహిళలు, చిన్నారుల నగ్న దృశ్యాలను చిత్రీకరించిన కేసుల్లో తెలంగాణ దేశంలోనే టాప్-2 ప్లేస్లో ఉన్నది.
నడిరోడ్డుపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దోపిడీలు, తీవ్రమైన దాడులు, కిడ్నాప్లు, గృహహింస, ఇండ్లు, ఆఫీసులు తగులబెట్టడం వంటి తీవ్రమైన నేరాలు(వైలెంట్ క్రైమ్స్) తెలంగాణలో అమాంతం పెరిగాయి. 2022లో ఈ తరహా నేరాలు 9,673 రికార్డు కాగా, 2023లో 10,069గా నమోదైంది. అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్రమైన నేరాలు ఏకంగా 27,447కు చేరాయి.
కేసీఆర్ పాలనతో పోలిస్తే రేవంత్ పాలనలో రాష్ట్రంలో వైలెంట్ క్రైమ్స్ 172 శాతం మేర పెరిగాయని విశ్లేషకులు చెప్తున్నారు. హోంమంత్రిత్వ శాఖను తనదగ్గరే పెట్టుకున్న రేవంత్ ఎలాంటి సమీక్షలు నిర్వహించకపోవడం, పోలీసుశాఖల్లో మంత్లీ క్రైమ్ రివ్యూలు ముందులా జరుగకపోవడం వెరసి రాష్ట్రంలో క్రైమ్ రేటు అమాంతం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
