Telangana Martyrs memorial | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చరిత్ర ప్రతీకారం తీర్చుకున్నది. అవమానించి, వెళ్లగొట్టిన చోటే వెలుగు దివ్వె ప్రకాశించింది. తెలంగాణ అమరవీరులను నిత్యం స్మరించుకొనేలా అమరుల స్మారక కేంద్రం నిత్యకాంతిపుంజమై వెలిసింది. అవును! ఉద్యమ ప్రారంభంలో కేసీఆర్ సహా తెలంగాణవాదులు జలదృశ్యంలోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మొట్టమొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే చర్చలు సాగించేవారు. అప్పటి ఆంధ్రా సర్కారు అత్యంత కర్కషంగా వ్యవహరిస్తూ, కార్యాలయాన్ని ఖాళీ చేయించి, ఆ భవనాన్ని కూల్చివేసింది. ఇప్పుడు అదే స్థలంలో అమరవీరుల స్మారక కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించటం గమనార్హం. గురువారం అమరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. నాటి సంఘటనను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గుర్తు చేశారు.
చరిత్ర ప్రతీకారం తీర్చుకోవటం అంటే ఇదే! అని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమకాలం నాటి వివిధ ఘట్టాలను వివరించిన ఆయన.. తెలంగాణ విజయగాథ వెంట విషాద గాథ ఉన్నదని అన్నారు. ఎందరో బలిదానాలు చేసుకొన్నారని, వారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ స్మరిస్తూనే ఉంటుందని చెప్పారు. బతుకమ్మపై పేర్చిన పూలలో, మత్తడి దునుకుతున్న చెరువు నీటిలో అమరుల త్యాగాలు కనిపిస్తాయని వివరించారు. అమరుల త్యాగాలకు ప్రతీకగా అమరుల స్మారకం కొలువు తీరిందని, వారు జ్యోతి రూపంలో ఎల్లప్పుడు వెలుగుతూనే ఉంటారని తెలిపారు. 1952లో మొదలైన పోరాటం, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత పరిణామాలను ప్రస్తావించారు. 1969లో మొదలైన పోరాటంలో ప్రతి జిల్లా బులెట్ గాయాన్ని చవిచూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అణుబాంబు విస్ఫోటనంలా ఉద్యమాన్ని ఎవరు రాజేస్తారని ఎదురుచూస్తున్న క్రమంలో మలిదశ పోరాటం కేసీఆర్ నేతృత్వంలో మొదలైందని, ఆయన ఉపన్యాస గర్జనలో తెలంగాణ సమాజమంతా ఏకమైందని వెల్లడించారు. అక్కడి నుంచి మహోన్నత చరిత్రకు నాంది పలికామని అన్నారు.
సభలో ఆసీనులైన కవులు, కళాకారులు, సామాన్య జనం పదివేల క్యాండిల్ లైట్లతో అమరులకు ఘనంగా నివాళి అర్పించారు. ‘జోహారులూ.. జోహారులూ.. అమరులకు జోహార్.. వీరులకు జోహార్’ అంటూ దేశపతి గేయాలాపన చేయగా.. సభలో ఉన్నవారంతా నిల్చొని క్యాండిల్ లైట్లను ప్రదర్శించి, అమరులకు ఘన నివాళి అర్పించారు. సభలో లైట్లను ఆపేసి, ఒక్కసారిగా పదివేల క్యాండిల్ లైట్లను వెలిగించటంతో ఆ ప్రాంతమంతా క్యాండిల్ లైట్ల కాంతితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘సీఎం గారు ఎప్పుడూ తన ముఖంపై విషాద ఛాయలు కనిపించనివ్వరు. గుండె నిబ్బరంతో కనిపిస్తారు. శత్రువుల పట్ల చాలా కఠినంగా మాట్లాడుతారు. అయితే ఎవరికీ తెలియని ఆయనకున్న మరో పార్శ్యం ఆయన గుండెలో ఎప్పుడూ ఓ కన్నీటి వాన కురుస్తూనే ఉంటుంది. అందరికీ గుర్తుండే ఉంటుంది నిరాహార దీక్షను పూర్తి చేస్తూ సార్(కేసీఆర్) ఒక మాట అన్నారు. నా శవయాత్ర జరిగి తెలంగాణ రావాలనుకున్నాను తప్ప బిడ్డలెవరూ మరణించకూడదని అనుకున్నా. ఈ ప్రాణ త్యాగాలను నేను ఊహించలేదు. ఈ ఉద్యమంలో నేను అన్నీ అనుకున్న పద్ధతిలో పోరాట రూపాలను సృష్టించగలిగా. ఇది మాత్రం అనూహ్య పరిణామం. నన్ను జీవితాంతం గుండె కోత పెడుతూనే ఉంటుంది అని సీఎం అన్నారు. అంటే ఆయన గుండెలో ఎప్పుడూ ఓ వాన కురుస్తూనే ఉంటుంది’ అని దేశపతి తెలిపారు. దేశపతి ఆలపించిన గేయంతో సభాప్రాంగణం మొత్తం నిశ్శబ్దంగా మారింది. గేయం పూర్తవగానే జై తెలంగాణ.. అమరవీరులకు జోహార్ నినాదాలతో హుస్సేన్సాగర్ తీరం మార్మోగింది.