హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పపర్ స్టేషన్ (వైటీపీఎస్) రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషించనున్నది. మన దగ్గర ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్తులో దాదాపు సగం ఈ ఒక్క ప్లాంటే అందించనున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఒక్క ప్లాంటే 25,885.40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును రాష్ర్టానికి సరఫరా చేయనున్నది. రాష్ట్రంలోని ఎనిమిది థర్మల్ ప్లాంట్లలో రామగుండంలోని ఆర్టీఎస్-బీ ప్లాంట్ ఇప్పటికే మూతపడింది. మిగిలిన 7 ప్లాంట్ల నుంచి 52,499.03 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇందులో 25,885.40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వైటీపీఎస్ నుంచి స్వీకరించేందుకు పచ్చజెండా ఊపింది. వైటీపీఎస్లో 800 మోగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 5 యూనిట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 3 యూనిట్లు ప్రారంభమయ్యాయి. మిగిలిన రెండు యూని ట్లు ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది మే నెలాఖరులోగా యూనిట్-3, జూన్ నాటికి యూనిట్-5ను ప్రారంభించాని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
హైడల్ నుంచి 3,826.74 మిలియన్ యూనిట్లు
రాష్ట్రంలోని జల విద్యుత్తు కేంద్రాల నుంచి 2026 -27 ఆర్థిక సంవత్సరంలో 3,826.74 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొందేందుకు ఈఆర్సీ అనుమతించింది. ఇందులో నాగార్జునసాగర్ నుంచి 1,441.31, శ్రీశైలం నుంచి 1,481.47, దిగువ జూరాల నుంచి 395.06, పులిచింతల నుంచి 197.53, పోచంపాడు నుంచి 29.63, చిన్న హైడల్ ప్లాంట్ల నుంచి 74.07, పెద్దపల్లి మినీ హైడల్ ప్లాంట్ నుంచి 15.08, ఇంటర్ స్టేట్ వాటాగా ప్రియదర్శిని జూరాల నుంచి 192.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు ఈఆర్సీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో యూనిట్లవారీగా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి
యూనిట్ మిలియన్ యూనిట్లు