సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 5: సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం దేశానికే ఆదర్శమని స్టేట్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద కల్పించిన సౌకర్యాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న విలాసవంతమైన అపార్ట్మెంట్ల వలె ఈ ఇండ్లు కనిపిస్తున్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో పేదలకు గృహవసతి కలుగుతుందన్నారు. ఇక్కడ గృహాల లబ్ధ్దిదారులకు ఏ ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కకుండా, ఇంటికి సంబంధించిన పట్టా, అసెస్మెంట్ పత్రం, నీటి కనెక్షన్, కరెంట్ మీటర్ తదితర పత్రాలను లబ్ధిదారుల పేరు మీదనే అందించడం గొప్ప విషయమన్నారు. అదే విధంగా కాలనీవాసులు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకునే విధంగా నిర్మించిన ఫంక్షన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.