మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 38 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2.70 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.51 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 9.65 టీఎంసీలు. ఇప్పుడు 7.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 40 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్లో ప్రస్తుతం 588 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. జలాశయంలో గరిష్టంగా 312.04 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 306.10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.