నాగర్కర్నూల్: శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,41,633 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 2,21,483 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.30 అడుగులుగా ఉన్నది. శ్రీశైలం గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు. ఇప్పుడు 206.09 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి 2,01,452 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఇందులో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,386 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్కు వదులుతున్నారు.