Telangana Decade Celebrations |
ఏముండె తెలంగాణల..
కరెంటు లేని ఊర్లుండె..
తాండవించిన కరువుండె..
ముళ్ల కంపలున్న బావులుండె..
పల్లేర్లు మొలిచిన భూములుండె..
ఆకలికి ఏడ్చిన కడుపులుండె..
అన్నదాతల ఆర్తనాదాలుండె..
ఇప్పుడేమున్నది తెలంగాణల..
రైతు బంధువొచ్చిండు..
బీమాతో ధీమా వచ్చింది..
ఉచిత కరెంటొచ్చింది..
కాళేశ్వరం కదిలొచ్చింది..
ధాన్యపు రాశులు గుట్టలైనయ్..
పల్లెలన్నీ అలరారుతున్నయ్..
నా తెలంగాణ.. అన్నపూర్ణ!
హైదరాబాద్: నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర్వంగా చెప్పుకొనే గెలుపు. రూ.లక్ష కోట్ల సంపద సృష్టించాం అని పండుగ చేసుకొనేంత సంబురం. శభాష్! అని రైతన్న జబ్బ చరుచుకొనేంత గొప్ప కాలం.. పదేండ్ల ఈ పొద్దు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న చోటే, నేడు పండుగలా మారింది. ‘పల్లెపల్లెన పల్లేర్లు మొలిచే నా తెలంగాణలోనా!’ అని విషాద గీతాలు పాడుకున్న మనం ‘గలగలపారేటి గంగమ్మ తల్లి నల్లరేగళ్లకు మళ్లింది’ అని ఘనంగా చెప్పుకుంటున్నామంటే అంతా సీఎం కేసీఆర్ ఆలోచనలు, బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి అనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయంలో నెలకొన్న సమస్యలను సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్తు మొదలుకొని.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు అండగా నిలిచారు. వారి ప్రతి అడుగులో తోడయ్యారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ. రాష్ట్రంలో ఈ రంగంలో వచ్చిన మార్పులు, రైతాంగం సాధించిన ఘన విజయాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ఓసారి పరిశీలిస్తే..
తెలంగాణ వ్యవసాయ రంగానికి సాగునీటితో పాటు విద్యుత్ మరో పెద్ద సమస్య. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతం అంధకారం అవుతుందని హేళన చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తన చాతుర్యంతో రాష్ర్టాన్ని, రైతులను విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించారు. 2016 ఏప్రిల్ 1 నుంచి 9 గంటల ఉచిత విద్యుత్తును, 2018 జనవరి 1 నుంచి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్తును తెలంగాణ సర్కారు అందిస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇందుకోసం ఏటా రూ.5 వేల కోట్లు భరిస్తున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.36,889 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. ఇది కాకుండా రూ.38 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా, ట్రాన్స్ఫార్మర్స్, వైర్లైన్ల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణం వంటి ఆధునీకరణ పనులను చేపట్టింది. మొత్తం విద్యుత్తులో 40 శాతం వ్యవసాయ రంగానికే అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 8.17 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 27.20 లక్షలు ఉన్నాయి.
తెలంగాణ రైతులకు సాగు అంటే సవాళ్లతో కూడుకున్న పని. వానకాలం ఆ వానదేవుడు కరుణిస్తేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూమి బీడుగా ఉండేది. ఈ ప్రాంతంలో కోరలు చాచిన కరువు, సాగునీటి వసతి లేకపోవడమే కారణం. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే తొలుత మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేసి గోదావరి జలాలను బీడు భూముల్లో పారించారు. దాంతో కరువు ప్రాంతం నీళ్లతో కళకళలాడుతున్నది. బీడు భూముల్లో పసిడి పంటలు పండాయి. సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపయ్యింది. 2014-15లో యాసంగి, వానాకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.
తెలంగాణ రైతాంగం సాధించిన విజయానికి ఈ లెక్కలే తార్కాణం. ఏడేండ్ల కాలంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన సంపద పెరగటం గమనార్హం. 2014-15లో పంటలు, పశు సంపద, చేపల నుంచి వచ్చిన ఆదాయం రూ.73,658 కోట్లు మాత్రమే. ఇందులో పంటల వల్ల వచ్చిన ఆదాయం రూ.41,706 కోట్లు. అదే 2020-21లో వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం రూ.1.80 లక్షల కోట్లు. ఇందులో పంటల నుంచి వచ్చిన ఆదాయం రూ. 80 వేల కోట్లు. అంటే ఏడేండ్ల కాలంలో లక్ష కోట్ల ఆదాయం పెరిగింది.
2014-2018 వరకు 35.31 లక్షల రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. అదే విధంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.36 వేల లోపు రుణాలు గల 5.43 లక్షల మంది రైతుల రూ.1,207.37 కోట్ల రుణాలను మాఫీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 40.74 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం రూ.17,351 కోట్ల భారాన్ని భరించింది. మిగిలిన రుణాల మాఫీకి ఈ ఏడాది బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 10.92 లక్షల మంది రైతుల రూ.94 వేల వరకు గల రుణాలను మాఫీ చేయనున్నది.
స్వరాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో గోదాములు ఎక్కడుండేవో తెల్వదు. వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో అందుకనుగుణంగా మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. పంటల నిల్వకు రెండు, మూడు గ్రామాలకో గోదాం ఉండేలా వాటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. తొలినాళ్లలో 39 లక్షల టన్నుల సామర్థ్యం గల 700 గోదాములు మాత్రమే ఉండేవి. కొత్తగా మరో 800 గోదాములు నిర్మించిన ప్రభుత్వం ఈ సామర్థ్యాన్ని 74 లక్షల టన్నులకు పెంచింది.
రైతు వేదికలు: అసంఘటితంగా ఉన్న రైతులను ఏకం చేసేందుకు ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒకటి చొప్పున 2,601 రైతు వేదికల్ని ప్రభుత్వం నిర్మించింది. ఇందుకు రూ.572 కోట్లు ఖర్చు చేసింది. ఈ రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించేలా, ఆ పంటలను రైతులే మార్కెటింగ్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని నియమించింది. ఈ రైతు వేదికల ద్వారా ఇప్పటి వరకు 23 లక్షల మంది రైతులకు సాగుపై శిక్షణ ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు, పేదరికంతో అల్లాడిన తెలంగాణ రైతన్న.. సాగుకు పెట్టుబడి కూడా పెట్టలేని దుస్థితికి చేరాడు. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, అధిక వడ్డీల బారిన పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పరిస్థితిని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి ఏటా ఎకరాకు రూ.10 వేలు చొప్పున 65 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు 10 సీజన్లలో ఏకంగా రూ.65,192 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇంత భారీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమే. ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం ‘పీఎం కిసాన్’ను తీసుకొచ్చింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఏపీ, జార్ఖండ్ ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నాయి.
రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి ఆర్థిక అండ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఆ రైతుకుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నారు. దీనికి బీమా పాలసీ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ఇలా నాలుగేండ్లలో 1,00,782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్లు పరిహారంగా చెల్లించింది.
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతి జిల్లా మార్కెట్ యార్డుల్లో నాలుగైదు కొత్త షెడ్లను నిర్మించింది. 1.12 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల 70 కొత్త షెడ్లను నిర్మించింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2.78 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల 581 షెడ్లు ఉండగా, ప్రస్తుతం ఇది 3.90 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల 651 షెడ్లకు పెరిగాయి. ప్రతి మార్కెట్ యార్డులో రైతులు తమ ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు సిమెంట్తో బెడ్ పోయించింది.
తినడానికి సరిపడా పంట పడితే చాలనుకున్న తెలంగాణ.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేస్తున్నది. ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే కొనుగోళ్లు 400 శాతం పెరిగాయన్న మాట. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వాటా 14 శాతంగా ఉన్నది. 2014-15లో వరిసాగు రెండు సీజన్లలో కేవలం 34.98 లక్షల ఎకరాల్లో సాగైతే, 2022-23లో ఏకంగా 1.21 కోట్ల ఎకరాల్లో సాగైంది.
రైతులు పండిస్తున్న ప్రతి గింజకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ధాన్యం మాత్రమే కాకుండా, ఇతర పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. కందులు, మక్కలు, జొన్నలు, శనగలు, పొద్దుతిరుగుడు వంటి పంటలను కొంటున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.10,805 కోట్ల విలువైన 41.09 లక్షల టన్నుల ఉత్పత్తులను ప్రభుత్వం కొన్నది.
మార్కెట్లో డిమాండ్ గల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మిషన్ ఆయిల్పామ్ను అమలు చేస్తున్నది. మూడేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అనుగుణంగా రైతులను ప్రోత్సహించేందుకు రుణాలతో పాటు సబ్సిడీలను అందిస్తున్నది. గత ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగు చేయించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఆయిల్పామ్ సాగు 1.42 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఏడాది మరో 2 లక్షల ఎకరాల్లో సాగును లక్ష్యంగా పెట్టుకున్నది.
యాంత్రీకరణ: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ రైతులకు పలు రకాల వ్యవసాయ ఉపకరణాలను సబ్సిడీలో అందజేస్తున్నది. ఇప్పటి వరకు 2.44 లక్షల మంది రైతులకు రూ.783 కోట్లతో పలు యంత్రాలను అందించింది.
నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు కింద జైలుకు పంపేలా చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.
జారీచేసిన వారు: స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ