కరీంనగర్: ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిమాజామాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లో (Karimanagar) అప్పగించేందుకు నిర్మల్ జిల్లా సిబ్బంది రెండు బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిళికొండ వద్ద నిర్మల్, బాన్సువాడకు చెందిన బస్సులు ఢీకొన్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్ మోయినోద్దీన్, సిబ్బంది పురుషోత్తంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, పలువురు అధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇద్దరు మినహా మిగతా వారంతా స్పల్పంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.