హైదరాబాద్ : రాష్ట్రంలో 8వ విడత హరితహారం కింద 19.54 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. హరితహారం కింద ఈ ఏడాది 19.54 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 8.76 కోట్ల మొక్కలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 7.32 కోట్లు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 5 కోట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 1.54 కోట్ల మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలను విరివిగా నాటాలని సూచించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువల వెంట కూడా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు శాంతికుమారి సూచించారు. హరితహారం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.