హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు, కల్వర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.1,865 కోట్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లను ఆర్ అండ్ బీ శాఖకు విడుదల చేసింది. భారీ వర్షాలకు అనేకచోట్ల రోడ్లు దెబ్బతినటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం జాప్యంలేకుండా నిధులను విడుదల చేసింది. నిధులు మంజూరైన నేపథ్యంలో రోడ్ల మరమ్మతు, కల్వర్టుల నిర్మాణానికి అధికారులు టెండర్లు ఖరారు చేయనున్నారు.
ఇటీవలే సమీక్ష.. వెంటనే నిధుల విడుదల
రాష్ట్రంలో ఈ వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు అనేకచోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్వర్టులు కూడా కొట్టుకుపోవటంతో, ఈ నెల 10న ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, కల్వర్టులకు రూ.635 కోట్లు అవసరమని అధికారులు తెలుపటంతో, ఆ మేరకు నిధులు ఇవ్వాలని ఆర్థికశాఖను అప్పటికప్పుడు ఆదేశించారు. తాజాగా ఆర్ అండ్ బీ నుంచి పూర్తి ప్రతిపాదనలు అందటంతో నిధులు మంజూరుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మరమ్మతు పనులు వెంటనే చేపట్టనున్నారు. ఇప్పటికే అత్యవసర పనుల కింద రూ.50 కోట్లతో మరమ్మతులు నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి (రూరల్) సర్కిళ్లలో మొత్తం 4,235 కిలోమీటర్ల రహదారులు, పలు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి మరమ్మతులకు వెంటనే టెండర్లు పిలిచి, రెండు నెలల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.