హైదరాబాద్: రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న 15 మంది తీవ్రంగా గాయడపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో వ్యానులో 37 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. బాధితులంతా హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. గుల్బర్గా వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
మరో ఘటనలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద ముందువెళ్తున్న కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించారు.