హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గతం కంటే మూడు రెట్ల అధికాదాయం వస్తున్నది. 2022-23లో రూ.170 కోట్లు దాటింది. పునరుద్ధరణ అనంతరం ఆలయాన్ని ప్రారంభించి ఈ నెల 28తో సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఈ ఆలయాన్ని సీఎం కేసీఆర్ పత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1200 కోట్ల తో అభివృద్ధి చేసి, ప్రారంభించారు.
గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ
వెయ్యేండ్ల ్లనాటి ఆలయాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని భక్తులే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో 2014-15తో పోల్చుకుంటే 2022-23 వరకు భక్తుల్లో 20 లక్షల వరకు వృద్ధి నమోదవగా, ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2019-20లో 52 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా, 2022-23 మార్చి 20 నాటికే భక్తుల సంఖ్య కోటి దాటింది. 2014-15లో కేవలం రూ.61 కోట్ల ఆదాయం సమకూరగా, 2022-23 మార్చి 20 నాటికి రూ.169 కోట్లు దాటింది. శని, ఆది వారాలతోపాటు సెలవు దినాలు, పండుగ రోజుల్లో భక్తులు సగటున 60 వేలమంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో వారాంతాల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రేక్ దర్శనాలను 2022-23 నుంచే ప్రవేశపెట్టగా, ఫిబ్రవరి నాటికి 74,668 మంది స్వామివారిని దర్శించుకొన్నారు. 2014-15లో 1,83,615 మంది వీఐపీ దర్శనాలు చేసుకోగా, 2022-23 ఫిబ్రవరి నాటికి 5.18 లక్షల మంది దర్శించుకున్నారు.