హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖాన ముందు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2న ఆవిష్కరిస్తారని, గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన బుధవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనియవాస్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ 14 ఏండ్లు గాంధీజీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తొలుత సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహాం వద్ద నివాళులు అర్పిస్తారని, అక్కడి నుంచి గాంధీ దవాఖానకు చేరుకుంటారని వివరించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీని వదిలి గాడ్సేలను కొలుస్తున్న దౌర్భాగ్యపు వ్యవస్థను చూస్తున్నామని అన్నారు. అంతకుముందు ఆయన ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
ధ్యానభంగిమలో మహాత్ముడు
16 అడుగుల ఎత్తు.. 5 టన్నుల బరువు
1.25 కోట్ల వ్యయం..
కోటి రూపాయలతో చుట్టూ సుందరీకరణ పనులు
తయారీదారు రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ లిమిటెడ్