ASHA Workers | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కొత్తగా 1,540 మంది ఆశ కార్యకర్తలను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు నియామకానికి అనుమతులిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి ఉత్తర్వులు జారీచేశారు.
ఇందులో హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 పోస్టులు ఉన్నాయి. వీటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా నియమించనున్నారు. భారీసంఖ్యలో ఆశ కార్యకర్తల నియామకం పట్ల వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. ‘సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రాథమిక వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 మంది ఆశ కార్యకర్తలను నియమించాలని నిర్ణయించింది’ అని ట్వీట్ చేశారు.