కొత్తగూడెం క్రైం, జనవరి 30: తుపాకుల మోతలతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు మెరుపు దాడికి దిగడంతో ముగ్గురు జవాన్లు నేలకొరిగారు. మరో 15 మంది గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు టేకులగూడ వద్ద సీఆర్పీఎఫ్, పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం నూతన సీఆర్పీఎఫ్ క్యాంపును ప్రారంభించారు. తర్వాత సైనికులు అక్కడి నుంచి పెట్రోలింగ్కి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన వంద మందికి పైగా సాయుధ మావోలు టేకులగూడ శిబిరంపై మెరుపు దాడికి దిగారు. జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు.
ఈ కాల్పుల్లో కోబ్రా 201 బెటాలియన్కు చెందిన జవాన్లు దేవాన్ సీ, పవన్కుమార్, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్కు చెందిన లంబాధర్ సిన్హా అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. 2021లో ఇదే ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 23 మంది జవాన్లు వీరమరణం పొందారన్నారు.