చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రావెల్స్ బస్సు, టిప్పర్ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలచిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.