రోగమొస్తే సర్కారు ఉన్నదన్న ధీమా.. ఒక్క రూపాయీ ఖర్చు ఉండదన్న నిశ్చింత.. కార్పొరేట్ వైద్యం అందుతుందన్న హామీ..
ఇందుకు నిదర్శనాలే..
12 లక్షల మందికి చేకూరిన లబ్ధి..
చేసిన రూ.5,550 కోట్ల ఖర్చు..
ఏటా జరిగిన లక్షన్నర శస్త్రచికిత్సలు..
ఇది ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా రాష్ట్రప్రభుత్వం అందించిన ధైర్యం!
పేదోళ్ల పట్ల సీఎం కేసీఆర్ సర్కారుకు ఉన్న నిబద్ధత!!
కరోనాలోనూ ఆగని సేవలు
కరోనా తీవ్రస్థాయిలో ఉన్నా ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగించింది. మొదటి వేవ్లో వైద్య సిబ్బంది మొత్తం టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్, జ్వరసర్వే, కొవిడ్ సేవల్లో మునిగినా, అత్యవసర చికిత్సలకు విఘాతం కలుగనీయలేదు. రెండోవేవ్ ఉధృతిలోనూ శస్త్రచికిత్సలు లక్ష దాటాయి.
హైదరాబాద్, మార్చి 13 : ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 87.5 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. తద్వారా దేశంలోనే అత్యధిక కుటుంబాలకు హెల్త్ కవరేజీ ఇస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. తాజాగా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను కలిపి అమలు చేస్తున్నది. ఒకప్పుడు రూ. 2 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందగా, ఇప్పుడు ఆ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది. ‘మేం మంచిని మంచి అని ఒప్పుకుంటం.
ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తీసుకొచ్చిన్రు. ఇది ప్రజలకు మేలు చేసే పథకం కాబట్టి కొనసాగిస్తున్నం. మరింత బలోపేతం చేస్తున్నం’ అని సీఎం కేసీఆర్ పలుమార్లు ఆరోగ్యశ్రీని ఉద్దేశించి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీలో అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి చికిత్సలు అందుబాటులో లేవు. పేదల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. చికిత్సల సంఖ్యను పెంచి, పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి చికిత్సల ఖర్చు పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. పెను ఆర్థిక భారం నుంచి పేదలను విముక్తి చేశారు. మంత్రి హరీశ్రావు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టాక ఆరోగ్యశ్రీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వైద్య సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ, ఆరోగ్యశ్రీ సేవలు పెంచాలని సూచనలిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చినవారికీ ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు అందించాలని ఆదేశాలిస్తున్నారు.
కరోనాలోనూ ఆగని సేవలు
కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నా ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగించింది. మొదటి వేవ్లో వైద్య సిబ్బంది మొత్తం టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్, జ్వరసర్వే, కొవిడ్ సేవల్లో మునిగినా, అత్యవసర చికిత్సలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకొన్నది. రెండోవేవ్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనూ శస్త్రచికిత్సలు లక్ష దాటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సర్జరీల సంఖ్య 1.07 లక్షలుగా నమోదైంది.
బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్
ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తే దవాఖానలకు బిల్లుల చెల్లింపునకు గత ప్రభుత్వాలు ఏండ్లకేండ్లు సమయం తీసుకొనేవి. బకాయిలు రూ.వేల కోట్లకు చేరేవి. దీంతో ప్రైవేట్ దవాఖానాలు కునారిల్లిపోయేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం వీలైనంత వరకు పెండింగ్ లేకుండా చూసుకొంటున్నది. ప్రస్తుతం రూ.200 కోట్లు పెండింగ్లో ఉన్నా, రూ.150 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.