TSRTC | హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా వెళ్లిపోయారు. ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు తెలిపారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.
పండుగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించిన ఆర్టీసీ.. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.