హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దానిలో భాగంగా త్వరలో గురుకుల పాఠశాలల్లో భారీ ఎత్తున ఖాళీల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసే దిశగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్నమైంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి మొత్తంగా 9,096 పోస్టులకు ప్రతిపాదనలను పంపగా, దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వం అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. వాటికి ప్రభుత్వం మంజూరు చేసిన 2,591 పోస్టులకు ఆర్థికశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టులను గుర్తించారు. వాటిలో లెక్చరర్, ప్రిన్సిపాల్ తదితర పోస్టులను ట్రిబ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ల విడుదల మొదలు, పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను ట్రిబ్ రూపొందిస్తున్నది.
తొలుత లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్
తొలుత డిగ్రీ, జూనియర్ గురుకుల కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీని చేపట్టాలని ట్రిబ్ నిర్ణయించింది. ఆ తరువాత ప్రిన్సిపాల్ పోస్టు లు, ఆపై పీజీటీ, టీజీటీ, తర్వాత సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన ఆయా పోస్టుల రిజర్వ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆయా పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ట్రిబ్ సిద్ధంగా ఉంది.