హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. బుధవారం తిరుపతి పర్యటనలో భాగంగా బాజిరెడ్డి తిరుపతి ప్రధాన బస్టాండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రిజర్వేషన్ కౌంటర్ను తనిఖీ చేశారు. అనంతరం తిరుపతి బస్టాండ్ వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సుల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సిబ్బంది విశ్రాంతి గదులను పరిశీలించారు. టీఎస్ఆర్టీసీ బస్సులలో టికెట్తో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సంస్థ అందిస్తున్న వసతులపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టీటీడీ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయని, భక్తులు ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని సంస్థను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీకి 1,150 కొత్త బస్సులు; 360 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ల పూర్తి
ఆర్టీసీకి కొత్త బస్సులు రానున్నాయి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మొత్తం 1,150 వరకు కొత్త బస్సులు తెచ్చేందుకు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికే మొత్తం 360 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తయినట్టు వివరించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంతోపాటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం రూట్లలో నడపనున్నారు. అదేవిధంగా, కొత్తగా 630 సూపర్ లగ్జరీ బస్సులు, 130 డీలక్స్ బస్సులు, 16 స్లీపర్ ఏసీ బస్సులను కూడా అందుబాటులోకి తేనున్నారు.