నిజామాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అది కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారు తాడ్కోలు ప్రాంతం. అక్కడ ఒకేచోట 1000 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఎటు చూసినా జీ+1 పద్ధతిలో అం దమైన ఇండ్ల సముదాయాలు, కాలనీలు ఏర్పడ్డాయి. ఈ సముదాయాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్, విద్యుత్తు సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి సదుపాయాలు కల్పించారు. ఈ భారీ ఇండ్ల సముదాయం.. ఇప్పుడు చిన్నపాటి గ్రా మంగా అవతరించింది. మొత్తం 3,500 మంది జనాభాతో శోభిల్లుతున్నది. ఈ డబుల్ ఇండ్ల సముదాయాన్ని ప్రస్తుతం కేసీఆర్ నగర్గా పిలుస్తున్నారు. ఇందులోని కాలనీలు పీఎస్ఆర్ (పోచారం శ్రీనివాసరెడ్డి)గా వాడుకలోకి వచ్చా యి. మొదటి ఫేజ్లో 500, రెండో ఫేజ్లో 504 మందికి జనవరి 28న ఇండ్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ మానవీయత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతోనే తమకు సొం తింటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాన్సువాడ రికార్డు
స్పీకర్ పోచారం ప్రత్యేక చొరవతో బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం పథ కాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో గూడులేని పేదలు ఉండకూడదని భావించి అందుకు తగ్గట్టుగా వేలాది ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తన నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధికంగా 11వేల ఇండ్లను మంజూరు చేయించుకొని చకచకా నిర్మాణాలు చేపట్టి పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 7 వేల ఇండ్లను పూర్తిచేసి పేదలతో గృహప్రవేశాలు చేయించారు. మరో 4 వేల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా ఊరూరా డబుల్ బెడ్ రూం ఇండ్లతో పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. తాడ్కోలు శివారులో ఆవిర్భవించిన కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ఏకంగా రూ.90 లక్షలతో కల్యాణ మండప నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఇదే ప్రాంతంలో మరో వెయ్యి ఇండ్లను నిర్మించి మొత్తం 2వేల డబుల్ ఇండ్లతో భారీ సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు స్పీకర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఖరీదైన ఇండ్లు ఉచితంగా పంపిణీ
బాన్సువాడ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ పట్టణంలో ఏ మూలకు వెళ్లినా వ్యవసాయ, నిర్మాణ స్థలాల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం చదరపు గజం ధర రూ.10 వేలకు తక్కువ ఎక్కడా లేదు. తాడ్కోలు శివారు కేసీఆర్ నగర్లో భూమి విలువతో కలుపుకొంటే ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి విలువ రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పలుకుతున్నది. వెయ్యి ఇండ్లకు మొత్తం రూ.200 కోట్లు అవుతున్నది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలకు రూ.20 లక్షలు వెచ్చించి సొంతింటి కలను నెరవేర్చుకోవడం కష్టమే. ఇలాంటి తరుణంలో లక్షల ఖరీదు చేసే ఇండ్లను ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
కేసీఆర్ మానవీయతకు నిదర్శనం
ఉమ్మడి రాష్ట్రంలో పేదలు సొంతిల్లు నిర్మించుకోవడానికి అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు రూ.400, మర్రి చెన్నారెడ్డి హయాంలో రూ.1000, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రూ.6 వేలు, చంద్రబాబు సమయంలో రూ.40 వేలు, వైఎస్ కాలంలో రూ.70 వేలు సాయం చేసేది. ఇందులో సగం ప్రభుత్వం ఇస్తే మిగిలిన సగం లబ్ధిదారుడు భరించాల్సి వచ్చేది. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ప్రజలకు చేరడం అన్నది పగటి కలగానే మిగిలేది. కానీ.. స్వరాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు ఉండకూడదన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూపకల్పన చేశారు. ఏకంగా వందశాతం రాయితీతో ఇండ్లు కట్టించి ఇవ్వడం సీఎం కేసీఆర్ మానవీయతకు నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు. కేసీఆర్ సహకారంతో బాన్సువాడలో 11 వేల ఇండ్లు మంజూరయ్యాయి. 7 వేల మందితో గృహప్రవేశాలు చేయించడం చాలా ఆనందంగా ఉన్నది.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
ఇల్లు ఫ్రీగా ఇచ్చిండ్రు
బాన్సువాడలో పోచారం సార్ కాలనీల తిరిగినప్పుడు పేదోళ్లకు సొంతిల్లు కట్టిస్తా అని చెప్పిండు. మా కల నిజం చేసిండు. పేదోళ్లు పోయినా డైరెక్టు మాట్లాడి పని చేస్తడు. గింతమంచిగా ఇండ్లు కట్టించి ఇచ్చిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సార్కు రుణపడి ఉంటం. బాన్సువాడలో కిరాయి ఇంట్లో ఉండాలి అంటే కనీసం రూ.3 వేలు ఖర్చయ్యేది. పేదోళ్లకు సొంతిళ్లు ఇస్తానని చెప్పినట్లే మేలు చేసిండు. పోచారం సార్ను ఎప్పటికీ మరువబోం.
– కులకర్ణి సరిత, కోటగల్లి, బాన్సువాడ
సబ్ కే భగవాన్ కేసీఆర్, పోచారం సాబ్
బాన్సువాడకే సబ్ కే భగవాన్ జైసే సీఎం కేసీఆర్, పోచారం సాబ్ హై. బహుత్ గరీబ్ లోగోంకో అచ్ఛా కరే. జిందగీ మే కబీ భీ ఘర్ బన్లేనా బోలేతో నహీ హోతథ. బాన్సువాడ మే పోచారం సాబ్ నే గరీబ్ లోగోంకే ఆద్మీ హై. జో భీ లోగోంకే లియే కామ్ కర్తె ఉన్కో జిందగీ మే యాద్ రఖ్ లేతే. షుక్రియ అదా కర్తే. యేహ్ లోగ్ ఇత్నా అచ్ఛా కామ్ జో కరే.
– హీనాబేగం, లేబర్ కాలనీ, బాన్సువాడ