హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచి వారందరిని కోటీశ్వరులను చేస్తామని అన్నారు. హైదరాబాద్ పరేడ్గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన మహిళా సదస్సులో సీఎం ప్రసంగించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తే రాష్ట్రం బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ అవుతుందని చెప్పారు. మహిళా పొదుపు సంఘాల ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామం వద్ద నెల రోజుల్లో వంద దుకాణాలు కట్టిస్తామని ప్రకటించారు. అక్కడ మహిళా సంఘాల ఉత్పత్తులు టాటా, బిర్లా, అదానీ, అంబానీల ఉత్పత్తులతో పోటీపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం జరుపుకొనే అవకాశం కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ అని, తాము ఓ మహిళ నాయకత్వంలో పనిచేయడానికి గర్విస్తున్నామని చెప్పారు. నిరుడు సెప్టెంబరు 17న సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించామని తెలిపారు. మహిళలను కట్టెల పొయ్యి కష్టాలను గట్టెక్కించేందుకు గతంలో దీపం పథకం ద్వారా సోనియాగాంధీ 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తే, ప్రధాని నరేంద్రమోదీ దానిని 1200కు పెంచి మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో 22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పా రు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.
మహిళల ఆశీర్వాదంతోనే ప్రభుత్వం
రాష్ట్రంలో ఆడ బిడ్డల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామని రేవంత్రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం లక్ష మందితో సదస్సు పెట్టామని, రానున్న రోజుల్లో పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్లో కవాతు నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామనే వారికి గుణపాఠం చెప్తామని అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలంటున్నారని, పదేండ్లుగా ప్రధానిగా మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర అడిగిన రైతులపై తుపాకీ తూటాలు పేల్చారని, ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని నయాపైసా వేయలేదని మండిపడ్డారు. నరేంద్రమోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, అందుకే బీజేపీ ప్రకటించిన 9 సీట్లలో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదని, కేసీఆర్ ప్రకటించిన నాలుగు సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లలో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అంటే
ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ. ఓ మహిళ నాయకత్వంలో పనిచేయడానికి గర్విస్తున్నాం.
-సీఎం రేవంత్రెడ్డి