హైదరాబాద్ : బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బస్తీ దవాఖానలను మొదట జీహెచ్ఎంసీకే పరిమితం చేసిన ప్రభుత్వం క్రమంగా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విస్తరిస్తున్నది. 2018లో 35 బస్తీ దవాఖానలు ప్రారంభం కాగా.. క్రమంగా ఈ సంఖ్య గత ఏడాది నాటికి 334కు పెరిగింది. గతేడాది ప్రభుత్వం కొత్తగా 98 బస్తీ దవాఖానలు ప్రారంభించింది. ఇప్పటివరకు సుమారు 2 కోట్ల మంది బస్తీ దవాఖానల్లో సేవలు పొందారు. టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మరో 100 దవాఖానలు ఏర్పాటు చేయనున్నారు.