హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ)ః మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప్రముఖ జ్యువెలర్స్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల ఆయా జ్యువెలరీ అనుబంధ సంస్థలు, బ్రాంచీల్లోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడలో సోమ, మంగళవారాల్లో జరిపిన తనిఖీల్లో ఈడీ అధికారులు దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆభరణాలు, బంగారం, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో జరిపిన సోదాల్లో జప్తు చేసిన బంగారం, ఇతర విలువైన ఆభరణాలను మొత్తం తొమ్మిది ట్రంక్పెట్టెల్లో ఈడీ కార్యాలయానికి తరలించారు.