Government Hospitals | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఉన్న పడకల సంఖ్య కేవలం 17 వేలు. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి కేవలం 1,400 బెడ్స్. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతో తొమ్మిదేండ్లలోనే అనూహ్య ప్రగతి నమోదైంది. కొత్త దవాఖానల ఏర్పాటు, ఉన్న దవాఖానల అప్గ్రేడేషన్ ఫలితంగా రాష్ట్రంలో పడకల సంఖ్య 34 వేలకు చేరింది. అంటే సగటున ఏటా 1,889 పడకల చొప్పున అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఆక్సిజన్ సరఫరా ఉన్న పడకలే కావడం విశేషం. 2014తో పోల్చితే ఆక్సిజన్ బెడ్ల సంఖ్య 25 రెట్లు పెరిగింది. ఇప్పుడు మొత్తం పడకలను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 25 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. మిగతా ఎనిమిది జిల్లాల్లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీతోపాటు ప్రతి జిల్లాలోనూ అనుబంధంగా స్పెషాలిటీ సేవలతో కూడిన దవాఖాన అందుబాటులోకి వస్తుంది. వీటికితోడు నిమ్స్ విస్తరణ, టిమ్స్ వంటి దవాఖానల నిర్మాణం, కొత్త పీహెచ్సీలు.. ఇలా అన్నీ కలుపుకుంటే దాదాపు మరో 16 వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత పడకల సంఖ్యతో కలిపితే రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరుతుంది.
త్వరలో రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ పడకల సంఖ్య 10 వేలకు చేరనున్నది. ఇందుకు ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు నిమ్స్ దవాఖాన మాత్రమే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు అక్కడికే వచ్చి చికిత్స పొందాల్సిన పరిస్థితి. నిమ్స్లో అప్పుడు కేవలం 900 పడకలు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య సుమారు రెట్టింపు అయ్యింది. దీనికి తోడు ఇప్పుడు ప్రభుత్వం నిమ్స్ విస్తరణ పనులు చేపట్టింది. అదనంగా ఎంసీహెచ్ నిర్మాణం అవుతున్నది. ఇవి పూర్తయితే మొత్తంగా 4వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూ పడకల సంఖ్య 10 వేలకు పెరుగనున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐసీయూ కేంద్రాలు ఐదు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 80కి పెరిగింది. కొత్త మెడికల్ కాలేజీలు, టిమ్స్, నిమ్స్తో విస్తృతంగా ఐసీయూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. వీటికితోడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎంసీహెచ్లు ఏర్పాటు చేస్తుండటంతో ఆరు వేల మాతాశిశు సంరక్షణ పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే.. 50 వేల పడకల్లో సుమారు సగానికిపైగా 26 వేల పడకలు సూపర్స్పెషాలిటీ, ఐసీయూ, మాతాశిశు వంటి ప్రత్యేక సేవలు అందించనున్నాయి. దీంతో భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ఎదురైనా, ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఎక్కడికక్కడ మెరుగైన వైద్యం అందించి కట్టడి చేసేందుకు వీలు కలుగనున్నది. రాష్ట్ర ప్రజావైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలువనున్నది. ఇప్పటికే నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ మూడో స్థానంలో నిలువగా.. 50 వేల పడకలతో ఇతర రాష్ర్టాలకు మార్గదర్శిగా మారనున్నది.