జనాభాకు అనుగుణంగా గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఏడేండ్ల క్రితం తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.ఈ వేదిక నుంచి ప్రధానమంత్రిని, ఈ రోజు హైదరాబాద్ వచ్చి విభజన రాజకీయాలు మొదలు పెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్షాను అడుగుతున్నా.. మీకు ఏం అడ్డు వస్తున్నది? ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నరు? మన పక్కన ఉన్న తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి తెలంగాణకు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావడం లేదు?
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..
ఈ రోజు ప్రధాని మోదీ పుట్టినరోజు. నేను ఈ వేదిక నుంచి.. ఈ తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. అయ్యా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంప్ కొట్టించి పంపించండి. మేం వెంటనే రిజర్వేషన్లు అమలు చేసుకుంటాం. రాష్ట్రపతి ఆదివాసీ బిడ్డే. మీరు ఫైలు పంపితే ఆమె ఆపరు. రిజర్వేషన్ పెంచాలని కేంద్రాన్ని అడిగీ అడిగీ విసిగిపోయినం. మోదీ.. మా జీవోను గౌరవించి అమలు చేపిస్తవా? లేదా?
గిరిజనుల కోసం దళితబంధు తరహాలో ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బంజారా, ఆదివాసీ భవన్లు గిరిజన జాతి సముద్ధరణ కేంద్రాలు కావాలని ఆకాంక్షించారు. గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు పొరుగు రాష్ర్టాల ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మేధోమథన కేంద్రాలు
హైదరాబాద్ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్లో దాదాపు రూ.60 కోట్ల ఖర్చుతో కుమ్రం భీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం చేసుకొన్నాం. వాటిని నా చేతుల మీదుగా ప్రారంభం చేయించుకొన్నందుకు సమస్త గిరిజన జాతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజమైన స్ఫూర్తితో ఆదివాసీ బిడ్డల సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ ధృక్పథంతో, సరైన పంథాలో ముందుకు పోవడానికి ఈ ఆదివాసీ, బంజారా భవన్లు వేదికలు కావాలని కోరుకుంటున్నాను. అక్కడ అటువంటి మేధోమథనం జరగాలని, అందులో గిరిజన, ఆదివాసీ మేధావివర్గం భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. మా ప్రజాప్రతినిధులు కూడా ఆ వేదికలను అద్భుతంగా వాడి, అక్కడ మేధోమథనం చేయాలని, అక్కడి నుంచి మీరు అందించే సలహాలు సూచనలతో తెలంగాణ గిరిజన జాతి సముద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని మనవి చేస్తున్నాను.
రిజర్వేషన్ పెంపుపై జాప్యమెందుకు?
ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పలుచబడ్డ గిరిజన జాతి కేవలం 5-6 శాతం మాత్రమే రిజర్వేషన్ పొందింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జనాభా ఆరు నుంచి పదిశాతానికి వెళ్లింది. దీని ప్రకారమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏడేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ వేదిక నుంచి ప్రధానమంత్రిని, ఈ రోజు ఇక్కడికి వచ్చి విభజన రాజకీయాలు మొదలు పెట్టిన హోం మంత్రి అమిత్షాను అడుగుతున్నా.. మీకు ఏం అడ్డు వస్తున్నది? ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నరు? రాష్ట్రపతి ఆమోదించి బిల్లును ఇక్కడికి పంపితే ఐదు నిమిషాల్లోనే మేం ఇక్కడ జీవో విడుదల చేస్తాం. రిజర్వేషన్ అమలైతే మా గిరిజన బిడ్డలకు బ్రహ్మాండంగా న్యాయం జరుగుతది. మరి దీన్ని ఎందుకు తొక్కిపెడుతున్నరు? రాజ్యాంగంలో కూడా ఎక్కడా దీనికి అడ్డం లేదు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అన్న ప్రతిబంధన లేదు. మన పక్కన ఉన్న తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏడో షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి తెలంగాణకు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావడం లేదు? మా రిజర్వేషన్ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి పంపాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది.
గౌరవిస్తరా? ఉరేసుకుంటరా?
ఈ రోజు ప్రధాని మోదీ పుట్టిన రోజు. నేను ఈ వేదిక నుంచి.. ఈ తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. అయ్యా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంప్ కొట్టించి పంపించండి. మేం వెంటనే రిజర్వేషన్లు అమలు చేసుకుంటాం. భారత రాష్ట్రపతిగా ఆదివాసి బిడ్డనే ఉన్నారు కాబట్టి మీరు ఫైలు పంపితే ఆమె ఆపరు. చిల్లర రాజకీయాలు తప్ప మీకు ఏది అడ్డుపడుతున్నది? మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి.. ఒక విభజన రాజకీయం పెట్టి..మనుషుల మధ్య విద్వేషాన్ని రగిల్చి మీ చిల్లర రాజకీయం కోసం వాడుకొంటున్నరు. కానీ మేము అట్లా కాదు. మాకు వచ్చే న్యాయమైన హక్కునే మేం అడుగుతున్నాం. రిజర్వేషన్ల అంశంపై నేను స్వయంగా ప్రధాన మంత్రిగారిని అడిగాను. ఆనాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నేను ఢిల్లీకి వెళ్లి అర్ధగంటపాటు ప్రధానికి వివరించి చెప్పాం. అయినా వాళ్లు ఇవ్వడం లేదు. గిరిజనులకు రిజర్వేషన్ పెంచుమని కేంద్రాన్ని అడిగీ అడిగీ విసిగిపోయినం. ఇక విసిగిపోదలుచుకోలేదు. వారం రోజుల్లో రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం జీవోను అమలు చేస్తాం. నరేంద్రమోదీ.. మా జీవోను గౌరవించి అమలుచేపిస్తవా? మీ గౌరవాన్ని కాపాకుంటరా? లేదంటే ఆ జీవోనే మీకు ఉరితాడు చేసుకుంటరా? ఆలోచించుకోండి.
పోడు భూములకు పట్టాలు
అమాయక గిరిజనులు అక్కడక్కడ పోడు వ్యవసాయం చేస్తుంటారు. వాళ్లకు భూములు ఇవ్వడానికి కమిటీలు ఏర్పాటు చేసి భూములు గుర్తించినం. ప్రభుత్వం 140 జీవోను కూడా విడుదల చేసింది. మీరు అన్ని గ్రామాల్లో ఎక్కడివాళ్లు అక్కడ యాక్టివ్గా ఉండి నివేదికలు పంపితే, వెంటనే పోడు భూములన్నింటినీ పట్టాలు ఇచ్చి వాళ్లకు కూడా రైతుబంధు ఇస్తాం.
గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు
గురుకుల విద్యాలయాల ఏర్పాటు, లైసెన్స్డ్ వ్యాపారాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్, టీ-ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, త్రీఫేజ్ కరెంటు.. ఇలా గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నాం. అచ్చంపేటలో కొండలమీద ఉండే గిరిజనులకు, ఆదిలాబాద్ ఆడవుల్లో ఉండే గిరిజనులకు కూడా కచ్చితంగా నల్లాల ద్వారా మంచినీళ్లు అందించాలని మిషన్ భగీరథ అమలు చేసేప్పుడు స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని ధనవంతుల ఇండ్లల్లో ఎలాంటి మంచినీళ్లు వస్తున్నాయో.. అంతే శుభ్రమైన నీళ్లు ఆదిలాబాద్ గోండు గూడాల్లో, అచ్చంపేట చెంచు గూడాల్లో, ప్రతి జిల్లాలోని లంబాడా తండాల్లో అందుతున్నాయి. ప్రతి గిరిజన ఇంటికి 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నాం. భద్రాచలం నుంచి వచ్చిన ఓ మిత్రుడు.. తమకు త్రీఫేజ్ కరెంట్ లేదని, ఇస్తే బాగా లాభం జరుగుతుందని చెప్పారు.
వెంటనే నేను సీఎస్తో చర్చించి అప్పటికప్పుడు రూ.300 కోట్లు మంజూరు చేశాను. ప్రతి గిరిజన తండాకు, ప్రతి గూడానికి త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నాము. సుమారు రూ.200 కోట్ల బకాయిలను కూడా మాఫీ చేశాం. తండాల్లో విష జ్వరాలు బంద్ అయ్యాయి. ఆకలి చావులు పోయాయి. ప్రత్యేక సంస్కృతి, భాష, జీవనశైలి గల గిరిజన బిడ్డల సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతున్నాం. గిరిజనులు ఎంతో గొప్పగా భావించి జరుపుకొనే అనేక జాతరలను, పండుగలను రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.వందల కోట్లు ఖర్చు చేసి అధికారికంగా నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల విద్యార్థులు 200 మంది వివిధ ఉన్నత చదువులు చదువుతున్నారు. ప్రభుత్వం మీకోసం ఇంకా ఎంతయినా ఖర్చు పెడుతది. గురుకులాలను ఇంకా పెంచుతం. ఈ ఏడాది ఇంకొన్ని ప్రారంభించేలా ఆలోచిస్తున్నం. గిరిజన ఆడబిడ్డలు బాగా చదువుకోవాలె. ఈ దేశంలో విద్యావంతులైన గిరిజన బిడ్డలు ఎక్కడున్నరు అని అంటే తెలంగాణలో ఉన్నారన్న కీర్తిప్రతిష్ఠలు సాధించాలి.
ఎనిమిదేండ్లలో ఎవరికీ మేలుచేయని కేంద్రం
కేంద్ర ప్రభుత్వం గడిచిన 8 ఏండ్లలో ఏ ఒక్క వర్గానికీ మంచి పని చేయలేదు. మనకు న్యాయంగా, ధర్మంగా దక్కాల్సిన హక్కులు కూడా ఇవ్వడం లేదు. దేశంలో అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. పేద ప్రజల ఉసురు పోసుకునేలా కేంద్ర విధానాలు ఉంటున్నాయి. రూ.లక్షల కోట్ల ప్రజా ఆస్తులను పెట్టుబడి దారులకు ఉచితంగా పంచేస్తున్నరు. ఎన్పీఏ పేరుమీద రూ.లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచి పెడుతున్నరు. ఈ దుర్మార్గ పాలనలో నిజమైన ప్రజా అవసరాలు గుర్తించకుండా సంకుచిత పెడ ధోరణితో భయంకరమైన పరిణామాలు తీసుకువస్తున్నరు. దేశంలో ఓవైపు ఎన్నో సమస్యలు ఉన్నయి. మరోవైపు విపరీతమైన ప్రకృతి సంపద ఉన్నది. నదుల్లో నీళ్లున్నయి. పుష్కలంగా ఇవ్వగలిగేంత కరెంటు ఉన్నది. చాలా సులభంగా పరిష్కరించే విషయాల్లో తాత్సారం చేస్తూ దేశాన్ని, ప్రజలను గాలికొదిలేస్తున్నరు. తమకు ఇష్టమొచ్చిన వ్యాపారవేత్తలకు ప్రైవేటైజేషన్ పేరిట రూ.లక్షల కోట్ల ప్రజా ఆస్తులను అప్పగిస్తున్నరు. ఈ దుర్మార్గం పోవాలె. ప్రజారాజ్యం రావాలె. రైతుల రాజ్యం రావాలె. ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలె. నదుల్లో ప్రవహించే నీళ్లు సముద్రంపాలు కాకుండా రైతుల పొలాల్లోకి రావాలె. తెలంగాణలో జరిగిన ప్రయత్నమే దేశమతా జరగాలె. ఇది జరగాలంటే తెలంగాణ ఒక జాతిగా భారత రాజకీయాలను ప్రభావితం చేయాలె. ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసినమో, అదే పద్ధతిలో దేశంలో జరిగే మతపిచ్చి కలహాలను, కుట్రలను, విద్వేష రాజకీయాలను తప్పకుండా బద్ధలు కొట్టాలె. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలె. అది పౌరులుగా మన కర్తవ్యం.
దేశానికి వెలుగు దివిటీలవుదాం..
సాధించుకున్న తెలంగాణలో జాతి, మతం అనే బేధం లేకుండా అందరం అన్నదమ్ముల్లా కలిసి జీవించాలె. ఒకరిని ఒకరు ప్రేమించుకునే మంచి సమాజం నిర్మాణం కావాలె. ఈ దేశానికి మనం వెలుగుదివిటీలు కావాలని ముందుకు సాగుతున్నాం. క్రమశిక్షణ, అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ, అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నాం. తెలంగాణ సమాజం ఐక్యత, పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు రేపే మతచిచ్చు మనకు అంటుకుంటే ఎటుగాకుండా పోతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ మళ్లీ కల్లోలానికి గురి కావొద్దు. కానీయొద్దు. విద్యావంతులు మేధావులు, బుద్ధిజీవులు ఎక్కడిక్కడ ప్రజలను అప్రమత్తం చేసి సమాజానికి కాపలాదారులుగా ఉండాలె. నా చివరి రక్తం బొట్టువరకు అందుకోసమే ప్రయత్నం చేస్తా. దేశంలోని యావత్తు అణగారిన జాతుల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్. ఆయనను సమున్నతంగా గౌరవించేలా తెలంగాణ కొత్త సెక్రటేరియట్కు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. ఈ రకంగా అన్ని వర్గాలను గౌరవించుకుంటూ సమాజం శాంతియుతంగా ముందుకు సాగాలె. అదే నా గుండెల నిండా ఉన్న కోరిక. దేవుడు ఇచ్చిన శక్తిని వినియోగించి ఈ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి అభ్యుదయం కోసం పనిచేస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
దళితబంధు తరహాలో గిరిజన బంధు
ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పోడు భూముల కమిటీ, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు నేను ఒక మాట చెప్పిన.. పోడు భూములు పంచిన తర్వాత అస్సలు భూమి లేకుండా ఉన్న గిరిజనులు ఎంతమంది ఉన్నరో చూద్దాం. ఆ లెక్క తేలిన తర్వాత ఇంటికి రూ.10 లక్షలు ఇస్తున్న దళితబంధు తరహాలో గిరిజన బంధు ప్రారంభిస్తాం. భూమి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజన బిడ్డల కోసం నా చేతులతో గిరిజన బంధును ప్రారంభిస్తా. మహారాష్ట్ర నుంచి కొందరు మిత్రులు వచ్చారు. మీరు జాతీయ పార్టీ అంటున్నరు.. మా రాష్ట్రంలో కూడా చాలా వెనుకబడివాళ్లు ఉన్నారు. మీరు మొదలు పెట్టండి..మహారాష్ట్ర నుంచి మేం కూడా మొదలు పెడతాం..మహారాష్ట్రలో మీకు బ్రహ్మాండమైన స్వాగతం చెబుతాం అని ఆహ్వానిస్తున్నరు. మనం పెట్టుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు చుట్టుపక్కల రాష్ర్టాల ప్రజలు కూడా ప్రభావితం అవుతున్నారు.
ఈఎన్సీ హరిరాంపై సీఎం ప్రశంసలు
ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ.. గజ్వేల్ ఈఎన్సీ హరిరాం సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈఎన్సీ పోషించిన పాత్రను వివరించారు. హరిరాం గిరిజనులందరికీ గర్వకారణమని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రశంసలపై తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్ల్లు హర్షం వ్యక్తం చేశారు. ఇంజినీర్ల సేవలను ప్రశంసించడంపై ఆనందం వ్యక్తం చేశారు.