దేశంలో ఏటా రెండు లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. కానీ, ఏడాదికి సగటున 50 వేల ఖాళీలను కూడా భర్తీ చేయటంలేదు. దీంతో ఏడున్నరేండ్లలో కేంద్ర సర్వీసుల్లో దాదాపు 10 లక్షలకుపైగా ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేయడం అటుంచితే, ఉన్న ఉద్యోగులనూ ఇంటికి పంపే కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపుతున్నది. పాత చట్టాలకు పదును పెడుతూ ప్రభుత్వ పాలనా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నది. దీనిపై నోరెత్తని తెలంగాణ బీజేపీ నేతలు, వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం విడ్డూరం.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన బీజేపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ మేం ఆ మాటే అనలేదని నాలుక మడతేసింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ అందమైన నినాదాలిస్తూ నిరుద్యోగుల చెవిలో ఎప్పటికప్పుడు పువ్వులు పెడుతున్నది. కొత్త ఉద్యోగాలివ్వకపోగా, ఉన్న ఉద్యోగులను ఇంటికి సాగనంపే కుట్రలు చేస్తున్నది. కేంద్ర సర్వీసుల్లో ఏటా రెండు లక్షల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని అంచనా. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవటంతో ప్రస్తుతం కేంద్రప్రభుత్వ పరిధిలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని కార్మిక, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 8 లక్షల ఖాళీలున్నాయని కేంద్రప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. వాటిని భర్తీచేసే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.
ఖాళీలను భర్తీ చేయకపోవటం అటుంచితే, మోదీ సర్కారు కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ లక్షల ఉద్యోగులను ఇంటికి పంపే కుట్రలు మొదలుపెట్టింది. ఫలితంగా బీజేపీ ఏడేండ్ల పాలనలో మంజూరైన ప్రతి నాలుగు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉన్నట్టు సిబ్బంది వ్యవహారాలు, పథకాల అమలు, కార్మిక తదితర శాఖల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014-15 నాటికి 52 కేంద్ర సర్వీసుల్లో మంజూరైన పోస్టుల్లో 11.45 శాతం ఖాళీలు ఉండగా, 2020-21 నాటికి అవి 24.45 శాతానికి పెరిగాయి. కేంద్ర విద్యారంగానికి 41,421 పోస్టులు మంజూరు కాగా, 13,701 ఖాళీలున్నాయి. నాన్టీచింగ్ పోస్టులు 61,624 మంజూరు కాగా, 24,945 ఖాళీలున్నాయి.
ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి విభాగంలో ప్రైవేటీకరణ అమాంతం పెరిగిపోయింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 2014 నాటికి కేంద్ర సర్వీసుల్లో వివిధ విభాగాల్లో 13 శాతం ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, నేడు 24 శాతానికి చేరటం గమనార్హం. ఏ శాఖ, ఏ కార్యాలయం, అనుబంధ ఆఫీసుల్లో కొత్త పోస్టులు మంజూరు చేయరాదని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ నిర్వహణ విభాగం 2020లోనే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో సృష్టించిన పోస్టులను కూడా భర్తీ చేయరాదని తేల్చి చెప్పింది.
బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులపై పాత చట్టాలనే ఆయుధంగా వాడుతున్నదనే విమర్శలున్నాయి. ఉద్యోగుల పనితీరు సమీక్ష ఫండమెంటల్ రూల్ 56 (జే), (ఐ), సెంట్రల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972లోని రూల్ 48 (1), బీలను వాడుకొని అనేకమంది ఉద్యోగులను రిటైర్మెంట్కు ముందే ఇంటికి పంపుతున్నది. 30 ఏండ్ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగుల రికార్డులను సమీక్షించాలని, అసమర్థ, అవినీతి సిబ్బందిని గడువుకు ముందే ఉద్యోగ విరమణ చేయించాలని అన్ని విభాగాలను ఆదేశించింది. ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటుచేసి ప్రతి మూడు నెలలకోసారి ఉద్యోగుల పనితీరును సమీక్షించాలని అన్ని విభాగాలకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఆ నిబంధనల పేరిట 163 మంది ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు, 157 మంది గ్రూప్ బీ అధికారులను నిర్భందం పదవీ విరమణ చేయించినట్టు లోక్సభలో కేంద్రమే స్వయంగా ప్రకటించింది. పైకి ఈ వ్యవహారం బాగానే కనిపిస్తున్నా, తమ అడుగులకు మడుగులొత్తని అధికారులపై అసమర్థ ముద్రవేసి ఇంటికి పంపుతున్నారనే విమర్శలున్నాయి.
ఉన్నత విద్యనభ్యసిస్తూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అణగారిన వర్గాలకు బీజేపీ ప్రభుత్వ విధానాలు అశనిపాతంగా మారాయి. మోదీ ప్రభుత్వ ప్రైవేటీకరణ చర్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ వర్గాలకు అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా ప్రైవేటీకరిస్తున్నారు. 2013లో కేంద్రంలోని అన్ని శాఖల్లో 1,52,841 ఖాళీలను భర్తీ చేయగా, అందులో 92,928 పోస్టులు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకే దక్కాయంటే ప్రభుత్వ రంగ నియామకాల ఆయా వర్గాలకు చేకూరుతున్న లబ్ధిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు కేంద్రం పూర్తిగా తిలోదకాలు ఇవ్వటంతో వెనుకబడిన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆయా క్యాటగిరీల్లో వేల సంఖ్యలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా కేంద్రం భర్తీ చేయడం లేదు. 2020 నాటికి ఎస్సీ 14,366, ఎస్టీ 12,612, బీసీ 15,088 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.