హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కామారెడ్డినుంచి బరిలో నిలుస్తున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మాచారెడ్డి మండల స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినబూనారు. మాచారెడ్డితో మొదలైన అఖండ విజయ శప థం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు విస్తరిస్తామని చెప్పారు. కామారెడ్డిలో దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాని భారీ మెజార్టీని ఇస్తామని ప్రకటించారు. నియోజకవర్గ సుందర దృశ్యం కోసం, అద్వితీయ ప్రగతి కోసం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒప్పించి సీఎం కేసీఆర్కు భారీ మెజార్టీ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇక్కడినుంచి పోటీచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం నుంచి 10 గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్కే మద్దతు ప్రకటిస్తున్నామని ఆయా గ్రామాలు చేసిన తీర్మానాల కాపీలను ఎంపీ బీబీ పాటిల్ నేతృత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. సీఎం కేసీఆర్కు కామారెడ్డి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివచ్చి, ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.
ఎమ్మెల్యే గంప విజ్ఞప్తి మేరకే..
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆ నిర్ణయం వల్ల రెండు నియోజకవర్గాలకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నూతనోత్సాహం వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డికి రావడం వల్ల కేవలం ఈ జిల్లానే కాకుండా ఉమ్మడి నిజామాబాద్తోపాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడాన్ని నిజామాబాద్ బిడ్డగా తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అందరిలానే తనకు కూడా ఉత్సాహంగా ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్కే ఓట్లేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కారుకు ఎదురులేకుండా సాగిపోయేటట్టు ఈ 10 గ్రామాల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారని, ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు ఉండేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధనే కేసీఆర్ను ఆహ్వానించారని వెల్లడించారు.
పార్టీలకతీతంగా ప్రగతి
పార్టీలకతీతంగా మాచారెడ్డి మండలంలోని గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్ను పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగానే చూస్తారని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. కామారెడ్డిలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ బోళాశంకరుడు అని, ఆయన చేతికి ఎముకంటూ ఉండదు కాబట్టే కామారెడ్డితోపాటు పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు.
ఈ నెల 28న కామారెడ్డిలో సభ
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న కామారెడ్డిలో సభ నిర్వహిస్తామని, తాను కూడా పాల్గొంటానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తామని చెప్పారు. ఎన్నికలు కాబట్టి పోటీ ఉన్నా లేకున్నా పని చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని వివరించాలని ఆమె నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
భారీ మెజార్టీ ఇద్దాం: బీబీ పాటిల్
కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు భారీ మెజార్టీ ఇద్దామని ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పరిధిలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పారు. కామారెడ్డికి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. కేసీఆర్ను నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆహ్వానించి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంచి పనిచేశారని ప్రశంసించారు.
గజ్వేల్ కన్నా ఒక్క ఓటు ఎక్కువే పడాలె
కామారెడ్డి ప్రజలు పౌరుషాన్ని చూపించడానికి ఇది మంచి సమయమని, గజ్వేల్ కన్నా ఒక ఓటైనా ఎకువ వేసి ఉద్యమ నేత కేసీఆర్ను గౌరవించుకోవాలని ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం చేశారు. అవార్డులు వచ్చిన గ్రామపంచాయతీలకు అభినందనలు తెలిపారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మన గ్రామాల అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన పల్లెల అభివృద్ధిని చూసి అవార్డులు కూడా ఇస్తున్నదని చెప్పారు. కామారెడ్డికి కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. ఆమె వెంట కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, మేడె రాజీవ్సాగర్, మఠం భిక్షపతి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు, గాంధారి మారెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు, పార్టీ మండలాధ్యక్షుడు బాలచంద్రం, పార్టీ సీనియర్ నేత తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.