హైదరాబాద్: తెలంగాణ.. మరో దివ్యక్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్తోపాటు, టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జీవీ బాస్కర్ రావుకు అసెంబ్లీలో సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్..తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కరీంనగర్ పట్టణం మధ్యలో 10 ఎకరాలు కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీనివాసుడి గుడిని సీఎం కేసీఆర్ సంకల్పంతో ఏడాదిన్నరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తిరుమలకు ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి వైభవం ప్రతిఫలించేలా అద్భుతమైన వేంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని చేపడతామన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ డీ దామెదర్ రావు, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుండవరం వెంకట భాస్కరరావు కృషితో ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో గుడి నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, మిగతా బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారన్నారు. వారందరికీ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.