KCR | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చిన్న నీటిపారుదల పథకాలతో ఆయకట్టు గణనీయంగా పెరిగిందని మరోసారి స్పష్టమైంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో వాటి అనుసంధానం వల్ల భూగర్భజలాలు పెరిగి, ఆయకట్టు పెరిగిందని కేంద్రజల్శక్తి శాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎంఐ 6వ సెన్సస్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ స్కీములు అత్యధికంగా ఉన్న టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నది. దేశంలో అత్యధికంగా యూపీలో 39.76 లక్షలు ( 17.2 శాతం), మహారాష్ట్రలో 35.73 లక్షలు (15.4 శాతం) మధ్యప్రదేశ్లో 22.85 లక్షలు (9.9 శాతం), తమిళనాడులో 21.15 లక్షలు (9.1 శాతం) ఉండగా, ఐదో స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో 16,79,868 (7.1శాతం) ఎంఐ స్కీములు ఉన్నాయి. జాతీయ సగటు ప్రకారంలో 5వ సెన్సస్తో పోల్చితే రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ స్కీములు 10.4 శాతం పెరిగాయి. 5వ సెన్సస్ నాటికి రాష్ట్రంలో 15,22,292 పథకాలు ఉండగా, ప్రస్తుతం అవి 16,79,868 పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంఐ స్కీమ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని, ఫలితంగా నీటిపారుదల లభ్యత పెరిగిందని, తద్వారా ఆయకట్టు పెరిగిందని నివేదిక వివరించింది. మిషన్కాకతీయ పథకం కింద మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణ, మేజర్, మీడియంతో ప్రాజెక్టులతో నీటి వనరుల అనుసంధానం, వాగుల పునరుజ్జీవం పథకం కింద చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్ట్ల కాలువల ద్వారా నీటి విడుదల కారణమని తెలిపింది. దాంతో భూగర్భ జలమట్టం పెరిగి ఆయకట్టు పెరిగిందని పేర్కొన్నది.
దేశంలో 2.31 కోట్ల మైనర్ ఇరిగేషన్ స్కీములు
2017-18లో 32 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 695 జిల్లాల్లో 6వ ఎంఐ సెన్సస్ చేపట్టగా, ఆ నివేదికను కేంద్రజల్శక్తిశాఖ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 2,31,38,964 ఎంఐ స్కీములు ఉన్నాయి. అందులో 97 శాతం పూర్తిగా పనిచేస్తుండగా, 2.1శాతం పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయని, 0.9 శాతం స్కీములు పనిచేయడం లేదని తెలిపింది. దేశంలోని చిన్న నీటిపారుదల పథకాలన్నీ దాదాపు 94.8 శాతం ఇప్పటికీ భూగర్భ జలాల ఆధారంగానే కొనసాగుతున్నాయని వివరించింది. వ్యవసాయబావులు, లోతులేని గొట్టపు బావులు, సర్ఫేస్లిఫ్ట్ పథకాలు గణనీయంగా తగ్గిపోతుండగా, మధ్యస్థ, లోతైన గొట్టపుబావుల్లో విపరీతంగా పెరుగుదల ఉన్నదని స్పష్టం చేసింది. భూగర్భజలాలు మరింత క్షీణించకుండా ఉండాలంటే ఉపరితల నీటివనరులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ స్కీములు వర్గం సంఖ్య