హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దవాఖాన ప్రసవాలు పెరిగినా, సిజేరియన్లు ఎక్కువగా అవుతుండటంపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ప్రసవాలపై ఆడిట్ చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సగటున 60 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్నట్టు వైద్యశాఖ నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, మంచిర్యాల వంటి జిల్లాల్లో 90 శాతం సర్జరీలు చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొందరు డాక్టర్లు డబ్బు ఆశతో ఆపరేషన్లు చేస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు చేయాలని గర్భిణులే డాక్టర్లను బలవంతపెడుతున్నారని, పైగా ముహూర్తాలనే మూఢ నమ్మకాలతో సిజేరియన్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రసవాలు పెంచేలా వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తున్నది. సీ-సెక్షన్లు ఎక్కువగా చేసే హాస్పిటళ్లు, గైనకాలజిస్టులను గుర్తించి అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెప్పినా వినకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని, దవాఖానలు, వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేసేందుకూ వెనుకాడొద్దని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
హెచ్చరికలు, కఠిన చర్యలు:
సిజేరియన్లను సగానికి పైగా తగ్గించాలని వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం మూడు మార్గాలను ఎంచుకొన్నట్టు తెలుస్తున్నది.
1. ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్కు ప్రస్తుతం రూ.11 వేల ఇన్సెంటివ్ ఇస్తున్నారు. సాధారణ కాన్పులకు ఇవ్వడం లేదు. ఇకపై సిజేరియన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని, సాధారణ ప్రసవం అయితే కొంత మేర ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్టు
సమాచారం.
2. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్లపై ఆడిట్ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఎంతమందికి సిజేరియన్లు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వంటి వివరాలపై పక్కాగా రికార్డు ఉండాలని ఆదేశించనున్నట్టు తెలుస్తున్నది.
3. ఎక్కువగా సీ-సెక్షన్లు నమోదవుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు, గైనకాలజిస్టులకు మొదటగా సిజేరియన్లు తగ్గించాలని సూచిస్తారు. అయినా ఫలితం కనిపించకపోతే దవాఖాన లైసెన్స్ను తాత్కాలికంగా కొన్ని నెలలు సస్పెండ్ చేయడం, గైనకాలజిస్టుల రిజిస్ట్రేషన్ను రద్దుచేసేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయటం వంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సిజేరియన్లతో రెండు ప్రధాన నష్టాలు:
1. ఆపరేషన్ వల్ల తల్లి శరీరం గుల్ల అవుతుందని, 35-40 ఏండ్ల వయసు వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయని అనేక నివేదికలు చెప్తున్నాయి. మొదటి కాన్పు సిజేరియన్ జరిగితే, కచ్చితంగా రెండోసారి కూడా సర్జరీ చేయాల్సి వస్తున్నది. దీంతో అనారోగ్య సమస్యల ముప్పు మరింత పెరుగుతున్నది.
2. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రు పాలు పట్టించాల్సి ఉంటుంది. అవి పిల్లలకు అమృతంతో సమానం. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సిజేరియన్ వల్ల ముర్రు పాలు పట్టించే అవకాశం లేకుండా పోతున్నది. దీంతో పిల్లలు బలహీనులుగా మారుతున్నారు. సిజేరియన్లపై ప్రజలకు అవగాహన కల్పించే సమయంలో ఈ రెండు అంశాలను నొక్కి చెప్పాలని వైద్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి.