హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీసీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్రెడ్డిని తీసేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్గాంధీకి లేఖ రాశారు. రేవంత్ను మార్చితే తప్ప రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి నియమావళిని పట్టించుకోకుండా పార్టీని తన సొంత వ్యవహారంగా భావిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీలో సీనియర్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి అనుభవ రాహిత్యం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తున్నాయని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అయోమయం సృష్టించారని ఆరోపించారు. తనతో సంప్రదించకుండానే ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. దీనిపై తాను టీపీసీసీ సమన్వయకర్త, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై మహేశ్కుమార్గౌడ్ ఫోన్ చేసినా రేవంత్రెడ్డి స్పందించలేదని పేర్కొన్నారు.