కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలపై భగ్గు
నిరసనలు.. దిష్టిబొమ్మలు దహనం
ఆయన పీసీసీ చీప్: మంత్రి కేటీఆర్
రేవంత్ సంస్కార హీనుడు: జగదీశ్రెడ్డి
సిటీ బ్యూరో, హైదరాబాద్, ఫిబ్రవరి 16 : రాష్ట్ర ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు వేడుకలు కాకుండా తద్దినం నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను నగరంలోని పలు ప్రాంతాల్లో టీఆరెస్ కార్యకర్తలు దహనం చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్లో రేవంత్ చిత్రపటాన్ని ఊరేగించి పిండ ప్రదానం చేశారు.
రేవంత్ క్షమాపణ చెప్పు: కొప్పుల
రేవంత్రెడ్డి భేషరతుగా సీఎం కేసీఆర్కు, తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లేకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వ్యవహార శైలి పైనా కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను దూషిస్తే తెలంగాణ సమాజం బట్టలూడదీసి కొడుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ హెచ్చరించారు. రేవంత్రెడ్డి ‘సూట్కేసు దొంగ’ అని వ్యాఖ్యానించారు. రేవంత్ సంస్కార హీనుడని మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ టీడీపీ కోవర్ట్ తెలిపారు.
చీప్ రేవంత్రెడ్డి
రేవంత్ వ్యాఖ్యలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘రాహుల్ గాంధీ గారు.. అత్యంత పనికిమాలిన వ్యక్తిని టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆయన మానసిక ఆరోగ్యం త్వరగా బాగుపడాలని కోరుకొంటున్నా’ అని ట్వీట్ చేశారు. ‘అస్సాం సీఎం చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా ఖండించి మా నాయకుడు సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ గౌరవాన్ని కాపాడారు. కానీ మీ పీసీసీ చీప్ మా నాయకుడి చావు కోరుకొంటున్నారు’ అని తీవ్రంగా మండిపడ్డారు.