హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, బీజేపీ స్కాంల పార్టీ అ ని అన్నారు. దేశంలో అత్యంత అవినీతిమయ పార్టీ బీజేపీ అని, ఏ టూ జడ్ స్కాంలను చేసిన పార్టీగా అది నిలుస్తుందని ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి కర్ణాటకలో ఓ రౌడీషీటర్ స్వాగతం పలికితే, ఇక్కడ పేపర్ లీకర్ స్వాగతం పలికాడని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పందంగా ఉన్నదన్నారు. తెలంగాణలో అవినీతి ఉంటే.. రాష్ర్టానికి ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా మద్దతు వస్తున్నదని.. సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటూ మహారాష్ట్ర నుంచి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కుటుంబ పాలనకు బీజేపీలో ఉన్న అత్యధికులు ఉదాహరణగా నిలుస్తారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధి, అనుమతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో లేఖలు రాసినా.. కేంద్రం, మోదీ స్పందించట్లేదని ఆరోపించారు.