హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హరిత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సంకల్పించారు. అధికారమెవరిదైనా, సర్కార్లు నిధులిచ్చినా ఇవ్వకున్నా హరితహారం ఆగకూడదని అపూర్వ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ హరిత నిధిని ప్రారంభించారు. ఒక ప్రభుత్వం మొక్కలు పెంచడం కోసం, ప్రజాభాగస్వామ్యంతో నిధి ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి. బహుశా ప్రపంచంలోనూ ఇదే తొలిసారి! వృక్ష ప్రేమికులైన కొందరు వ్యక్తులు, కొన్ని గిరిజన జాతులు, స్వచ్ఛంద సంస్థలు అడవుల రక్షణకు కొన్ని ప్రయత్నాలు చేశాయి. కానీ ఇలా అడవులను, మొక్కలను పెంచడానికి ఒక ప్రభుత్వం స్వయంగా నడుం కట్టడం, అందులో ప్రజలను భాగస్వాములను చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవడానికి సుంకాలు విధించిన సందర్భాలు చూశాం. కానీ పచ్చదనాన్ని పెంచడానికి అతి తక్కువ భారంతో చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరినీ భాగం చేయడం ఇదే తొలిసారి. హరిత నిధి ఏర్పాటుకు ముందు సీఎం చేసిన కృషి అంతా ఇంతా కాదు. హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలి? ఎలా పూర్తిస్థాయి ప్రజాఉద్యమంగా మార్చాలి? అన్న అంశంపై సీఎ అనేక వారాలుగా సివిల్ సర్వీసు అధికారులతో, అటవీ నిపుణులతో చర్చించి, హరితనిధి కోసం అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు. అంతకు ముందే శుక్రవారం ఉదయమే ప్రతిపక్ష నేతలు అక్బరుద్దీన్, మల్లు భట్టి విక్రమార్క తదితరులందరీకీ ఫోన్ చేశారు.
తెలంగాణను పది కాలాల పాటు పచ్చగా ఉంచేందుకు తానొక ప్రయత్నం చేస్తున్నానని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో హరితనిధి పరమోద్దేశాన్ని సోదాహరణంగా సభ్యులకు, దాంతో పాటే రాష్ట్ర ప్రజలకు వివరించారు. అక్కడితో ఆగలేదు. సభా నాయకుడైనప్పటికీ స్వ యంగా నడుచుకుంటూ కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క బెంచ్ వద్దకు వెళ్లి, మద్దతు కోరారు. సాధారణంగా అసెంబ్లీలో విపక్ష నేతలతో ఏదైనా చర్చించాల్సివస్తే, సభా నాయకుడు కబురు పంపి వారిని తమవద్దకు రప్పించుకునే సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ కేసీఆర్ ఎలాంటి భేషజాలకూ పోకుండా, సభలో తమకు పూర్తి ఆధిక్యం ఉన్నా, తెలంగాణ భావి తరాలకోసం ప్రతిపక్ష నేతను సిన్సియర్గా మద్దతు కోరారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విపక్షాలన్నీ మద్దతు పలికాయి. కేసీఆర్ ప్రయత్నాన్ని విపక్ష నేతలు ప్రశంసించారు. సాధారణంగా రాజకీయ నాయకులు అధికారం కోసమే ఆలోచిస్తారు. అధికారం సాధించడానికి, అధికారంలో నిలపడానికి అనువైన పథకాలనే ఎంచుకుంటారు. వాటికి నిధులు పెంచుకుంటారు. కానీ కేసీఆర్! తెలంగాణపై కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందనడానికి హరిత నిధి తాజా ఉదాహరణ. తన తెలంగాణ పది కాలాల పాటు, నిరంతరం, నిర్విరామంగా పచ్చగా ఉండాలన్న తపన ఉంటే తప్ప ఇలాంటి పథకాన్ని ఇంకెవరైనా పెట్టగలరా! హరిత నిధి పథకం దేశానికే ఆదర్శం అని వృక్ష ప్రేమికులు ప్రశంసించారు. సాధారణ రాజకీయ నేతలు ఇలాంటి ఆలోచన చేయలేరని, రాజనీతిజ్ఞులు మాత్రమే ఇంత సుదూరదృష్టితో ఆలోచించగలరని కొనియాడారు.
‘తన ప్రాంతం పట్ల ఎంతో నిబద్ధత, తన ప్రజలపై గుండెల నిండా ప్రేమ, తన భావి తరాలకు మంచి చేయాలన్న ప్రగాఢ ఆకాంక్ష ఉండే జాతి పితలాంటి వ్యక్తులు తప్ప మరొకరు ఇలాంటి ఆలోచనలు చేయలేరు’ అని అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. తెలంగాణ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని మిగతా రాష్ర్టాలు, దేశం, ఆ తర్వాత ప్రపంచం కూడా అనుసరించక తప్పదని అభిప్రాయపడ్డారు. ‘కేసీఆర్ చేసింది నిధి ఏర్పాటు మాత్రమే కాదు. చిన్నచిన్న మొత్తాల్లో ప్రజల నుంచి సొమ్ముల సేకరణ ద్వారా తెలంగాణ సమాజంలో పచ్చదనపు సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్ కల్పించారు. డబ్బులెవరైనా ఇవ్వొచ్చు. కానీ తామిచ్చే డబ్బు ఒక మొక్కకోసం అని తెలిసినప్పుడు, మొక్కల్ని కాపాడుకోవాలని వారిలో కలిగే స్పృహ చాలా గొప్పది. అది వారిచ్చే డబ్బుకన్నా ఎన్నో రెట్లు విలువైనది. పచ్చదనం ఉద్యమ రూపం తీసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది’ అని ఆర్థికశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఒకరన్నారు. రామాయణంలో శ్రీరాముడు అన్నట్టు…
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి!!