భక్తి టీవీ ఆధ్వర్యంలో 11 రోజుల వైభవ వేడుకలకు ఏర్పాట్లు
సిటీబ్యూరో, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ ) : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ నేటి నుంచి కోటి దీపోత్సవం నిర్వహించనుంది. ఈ మేరకు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 12 నుంచి 22 వరకు కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగనుంది. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు దీపోత్సవం ప్రారంభమవుతుంది.
ఈ ఉత్సవంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, శ్రీత్రిదండి శ్రీమన్నారయణ చిన్నజీయర్స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ, కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తదితర ప్రసిద్ధ గురువులతో పాటు ప్రవచన కర్తలు చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, గరికిపాటి నరసింహారావులు పాల్గొంటారు. ప్రతీ రోజు భక్తులు స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే విధంగా కార్యక్రమం జరగనుంది.
తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారక తిరుమల, ఒంటిమిట్ట తదితర ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవాలు జరుగుతాయి. పదకొండు రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో భాగంగా స్వర్ణలింగోద్భవం, మహానీరాజనం, సప్తహారతులు, సాంస్కృతిక కదంబాలు వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రవేశం ఉచితంగా ఉంటుంది. డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారు లేదా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్న వారిని అనుమతిస్తారు. దేవతామూర్తులు, దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలన్నింటిని ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.