హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనాతో రాష్ర్టానికి ఆర్థికంగా నష్టం కలిగినా వైద్య సదుపాయాలు మెరుగుపరచాలన్న గుణపాఠం నేర్పిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రతి బెడ్కు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గురువారం అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై స్వల్పకాల చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లోని వైద్య సదుపాయలను ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
బస్తీ నుంచి పల్లెల దాకా దవాఖానలు…
జీహెచ్ఎంసీలో ఈ ఏడాది చివరికి మొత్తం 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని టార్గెట్ ఇచ్చాను. డివిజన్కు రెండు, స్లమ్స్ ఉన్న డివిజన్లలో మూడు ఏర్పాటు చేయాలని చెప్పాను. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 226 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి. మరో 32 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో ఆలోచన చేశాం. భవిష్యత్లో కరోనా, ైస్వెన్ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది కాబట్టి.. పల్లె దవాఖానలకు పోతున్నం. కొద్ది రోజుల్లోనే అవి ప్రారంభమవుతాయి. పేద ప్రజలకు వైద్యం అందాలన్నదే మా లక్ష్యం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అంశాన్ని కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ పట్టించుకోలేదు. కరోనాతో పనులు మొత్తం ఆగిపోయినయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాష్ర్టానికి ఆదాయం రాకపోగా.. ఉల్టా లక్ష కోట్లు నష్టం కలిగింది. దాని వల్ల నేర్చుకున్న గుణపాఠం.. వైద్య వసతులు ఇంప్రూవ్ కావాలె! గతంలో ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానలు కలిస్తే వెయ్యి చిల్లర ఆక్సిజన్ బెడ్లు మాత్రమే ఉంటుండే. ఇప్పుడు 27వేల పడకలను ఆక్సిజన్ బెడ్లు చేసినం. 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి ప్లాంట్లు పెట్టుకున్నం.
నలువైపులా టిమ్స్
హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ వంటి పురాతన దవాఖానలు ఉన్నాయి. చిన్న వైద్యశాలలు మినహా, పెద్దస్థాయిలో కొత్తగా నిర్మించలేదు. అందుకే నగరం నలువైపులా 8 నుంచి 9వేల పడకలు, సకల సదుపాయాలతో 4 దవాఖానలను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరిట ఏర్పాటు చేశాం. అదే తరహాలో మిగిలిన మూడు దవాఖానల నిర్మాణానికి స్థలాలు గుర్తించాం. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల, ఛాతి వ్యాధుల దవాఖాన కలిపి 61 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఒక దవాఖాన నిర్మిస్తాం. మూడోది మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ రైల్వేస్టేషన్ పక్కన భారతీయ విద్యా భవన్ వాళ్ల నుంచి తీసుకున్న భూమిలో నిర్మిస్తాం. తూర్పు దిక్కున దవాఖాన కోసం గడ్డిఅన్నారం స్థలాన్ని సేకరిస్తున్నాం. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాటసింగారంలో అన్ని వసతులతో మార్కెట్ నిర్మిస్తాం. ఏ పండ్ల వ్యాపారికి, తోపుడుబండ్ల వ్యాపారికి నష్టం జరగకుండా చూస్తాం. గడ్డిఅన్నారంలో నిర్మించనున్న దవాఖాన పనులకు అంతా మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా.