హైదరాబాద్, జనవరి 10 : కొవిడ్ దెబ్బకు గత రెండేండ్లలో విదేశీ పర్యాటకుల రాక తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ఆస్కారం లేకపోవటం టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే విదేశీయులు రాకున్నా స్వదేశీ పర్యాటకుల సందర్శనలు మాత్రం ఆగలేదు. కరోనాకు ముందు గోవాను సగటున ఏడాదికి 80 లక్షల మంది సందర్శిస్తే, గతేడాది కేవలం స్వదేశీ పర్యాటకులే 50 లక్షల మంది వచ్చారు. తెలంగాణ కూడా లక్షల మంది స్వదేశీ పర్యాటకులను ఆకర్షించింది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలపై టూరిజం శాఖ వీడియోలు రూపొందించి వెబ్సైట్, సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. రామప్పకు యునెస్కో గుర్తింపు రావటం, భూదాన్ పోచంపల్లి వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్గా ఎంపికవటం రాష్ర్టానికి సానుకూలంగా మారాయి. రెండేండ్లుగా పర్యాటక రంగానికి ఊరట ఇస్తున్నది స్థానిక పర్యాటకులేనని, మరింత మందిని ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్యాకేజీలు తెచ్చిందని సంస్థ ఎండీ మనోహర్రావు వెల్లడించారు.