మహబూబ్నగర్ : కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ సంసిద్ధంగా ఉండేలా స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు మహబూబ్నగర్, జడ్చర్లకు కలిపి 32 చిన్నపిల్లల కోవిడ్ యూనిట్లు మంజూరు అయినట్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తనతో పాటు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కోరిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు జిల్లాకు కొత్తగా ఫస్ట్ బెడ్ కొవిడ్ చిన్నపిల్లల యూనిట్లను మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, వైద్యులు, బడ్జెట్ కూడా ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు.
మహబూబ్నగర్ వైద్యరంగంలో ఏడేళ్ల లో పెను మార్పులు చోటు చేసుకున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2014 పూర్వం మహబూబ్ నగర్ దవాఖానలో ఒక్క ఐసీయూ బెడ్ కూడా లేదని ఈ ఏడేళ్లలో 550 కి పైగా ఆక్సిజన్ బెడ్లతో పాటు, 67 ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్, ఎంఆర్ఐ, కొత్తగా డయాగ్నస్టిక్ సెంటర్తో పాటు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ దవాఖాన మాదిరిగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పాత కలెక్టరేట్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో వైద్యం కోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, అవసరమైతే హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ కు వచ్చేలా సకల సౌకర్యాలతో జనరల్ దవాఖానను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా మహబూబ్ నగర్ కు వచ్చి వైద్య సేవలు పొందేలా చూస్తామని పేర్కొన్నారు. వైద్యరంగంలో మహబూబ్ నగర్లో మరింత మార్పు తీసుకువస్తామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు పూర్తి భరోసా కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.