జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు వద్ద రూ.కోటి విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అందులో 13.5 లక్షల విలువైన టాయిలెట్స్ బ్లాక్ నిర్మాణానికి, 7 కోట్ల విలువైన వాటర్ ప్లాంట్ కి, 14.5 లక్షల విలువైన డ్రయింగ్ ప్లాట్ ఫామ్, 33 లక్షల విలువైన షెడ్ నిర్మాణం, 32 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్ధాపనలు చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధికి అడ్డాగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. రాష్ట్రం, జిల్లా, పాలకుర్తి నియోజకవర్గాన్ని గతం, ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి అండగా ఉన్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. సాగునీరు, మంచినీరు, కరెంటు, పంటల పెట్టుబడిగా రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, యాసంగి బియ్యం కొనడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. బియ్యం కొంటదా? కొనదా? అనే విషయాలను కూడా చెప్పడం లేదు. అందరినీ సమానంగా, కన్న బిడ్డలా చూసుకోవాల్సిన కేంద్రం, అన్యాయంగా వ్యవహరిస్తున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా పని చేసిన చాకలి అయిలమ్మ పేరు మీద పెట్టిన మార్కెట్ యార్డు, అంతే పేరు తెచ్చుకోవాలని, ఆ విధంగా మార్కెట్ కమిటీ పనిచేయాలన్నారు. చాకలి అయిలమ్మ కుటుంబాన్ని, వారి వారసులని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని మంత్రి ఈసందర్భంగా స్పష్టం చేశారు.