తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కింద మంజూరైన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మర్రిలో బుధవారం దళితబంధు నిధుల వినియోగంపై దళితులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తీవారీతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 4న సీఎం కేసీఆర్ గ్రామాన్ని సందర్శించి దళితవాడల్లో కాలినడకన కలియ తిరిగి వారి ఆర్థిక స్థితిగతులపై దళితులతో స్వయంగా మాట్లాడి గ్రామంలోని 76 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చోప్పున రూ.7.60కోట్ల నిధులు మంజూరు చేశారని అవి కలక్టరేట్లోనే ఉన్నాయన్నారు. మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవని ఎవరు కంగారు పడకుండా ఏ యూనిట్ పెడితే ఆర్థికంగా ఎదుగుతారో పూర్తి ఆధ్యయనం చేసి కుటుంబ సభ్యులంతా కూర్చోని మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు.
గత 10 రోజులుగా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దళితవాడల్లో ఇంటింటా తిరిగి తయారు చేసిన నివేదికలను చూశా మన్నారు. ఈ నివేదికనే చివరిది కాదని లబ్ధిదారులు యూనిట్ నిర్వహణపై ఒకటికి 10సార్లు ఆలోచించుకోని మంచి యూనిట్లను ఎంపిక చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు యూనిట్లను గ్రామంలోనే పెట్టుకోవాలనే నిబంధన ఏమి లేదని ఎవరికి నచ్చిన ప్రాంతాల్లో, వ్యాపారానికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో యూనిట్లను పెట్టుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు.
దళిత కుటుంబాలలోని చదువుకున్న యువకులపై ఎక్కువ బాధ్యత ఉందని వారు బాధ్యతగా ఆయా కుటుంబాలతో చర్చించి లాభాలు అధికంగా ఉండే యూనిట్లు పెట్టుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అందించిన నివేదికల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లను పెట్టుకునేందుకు మొగ్గు చూపారన్నారు. అలా పెట్టుకోవడం వల్ల సరుకులు అమ్ముడు పోక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అలా కాకుండా ఎవరికి ఏ రంగాల్లో ప్రావీణ్యం ఉందో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఎక్కడైనా యూనిట్లను ప్రారంభించుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు.
గతంలో సైతం ప్రభుత్వం ఎన్నో స్కీమ్లను ప్రవేశపెట్టిన సరైన అవగాహన లేక ఆర్థికంగా ఎదగలేక పోయారని వాట న్నింటిని దృష్టిలో ఉంచుకోని ఎంచుకున్న రకంపై పూర్తి అవగాహన వచ్చాకే యూనిట్లు పెట్టుకోవాలన్నారు. లబ్ధిదారులు విడివిడిగా యూనిట్లు పెట్టుకోవడంతో పాటు ముగ్గురు, నలుగురు కలిసి ఒక పెద్ద యూనిట్ను పెట్టుకోని సమిష్టి కృషితో ఆర్థికంగా ఎదురుకోవచ్చన్నారు. స్వయంగా తానే ఇంటింటికీ వచ్చి పరిశీలించి ఆసక్తి, నైపుణ్యం ఉన్న రకాలలో శిక్షణ కార్యక్రమాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరి ఒత్తిడికి ప్రలోభాలకు లొంగకుండా పుడ్ ప్రాసెసింగ్ తదితర లాభాలు చేకూర్చే తదితర పథకాలపై ఆసక్తి చూపాల న్నారు. ప్రభుత్వం నేరుగా దళితుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం గొప్ప విషయమని ఒక్కోక్కరూ రెండు లేదా మూడు పథకాలను ఎంపిక చేసుకోవచ్చాన్నారు. సమావేశంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి, లబ్ధిదారులు పాల్గొన్నారు.