Exit Polls | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు ఊగిసలాటలో ఉన్నాయి. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కు భారీ మెజార్టీ వస్తుందని చెప్పగా, మరికొన్ని సంస్థలు స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలిచ్చాయి. గురువారం రాత్రి సుమారు 18 సర్వే సంస్థలు ఎగ్జిట్పోల్స్ను వెల్లడించగా, ఇందులో 10 సంస్థలు బీఆర్ఎస్కు, 8 సంస్థలు కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. మెజార్టీ సర్వే సంస్థలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం గమనార్హం. సర్వే సంస్థలు బీఆర్ఎస్కు అత్యధికంగా 78 సీట్లు వస్తాయని వెల్లడించగా, కాంగ్రెస్కు 68 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. బీఆర్ఎస్కు అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలు.. ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 60కి పైగానే సీట్లు వస్తాయని తెలిపాయి. కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన సర్వే సంస్థలు మాత్రం… ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్కు అటూ ఇటుగా సీట్లు ఇచ్చాయి. 2018 ఎన్నికల్లోనూ అనేక సర్వే సంస్థలు ఇలాంటి ఫలితాలనే ప్రకటించాయి. కానీ, ఆ సర్వేల ఊహకు కూడా అందనంతగా బీఆర్ఎస్ 88 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి బంపర్ మెజార్టీ సాధించింది.
అసెంబ్లీ ఎన్నికలపై గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్పోల్స్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాయి. ప్రజలను గందరగోళపర్చటంతోపాటు ఆ సర్వేలు నిర్వహించిన సంస్థలు కూడా తీవ్ర గందరగోళంలో పడినట్టు ఆ లెక్కలను బట్టి అర్థమవుతున్నది. 2018 ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా సరిగ్గా ఇలాంటి గందరగోళమే కనిపించింది. ఎగ్జిట్పోల్స్ ఫలితాల పేరుతో పలు సర్వే సంస్థలు తీవ్ర గందరగోళానికి తెరలేపాయి. కొన్ని సంస్థలు అధికారం బీఆర్ఎస్దేనని, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్దని, ఇంకా కొన్ని సంస్థలు హంగ్ అంటూ లెక్కలు చెప్పాయి. మెజార్టీ సంస్థలు వాస్తవ ఫలితాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. ఏ సంస్థ అంచనా వేయని విధంగా ఫలితాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఏకంగా 88 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లోనూ గతంలో మాదిరిగానే ఎగ్జిట్పోల్స్ అంచనాలు మళ్లీ తలకిందులు కావడం ఖాయమనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88 స్థానాలు వస్తాయని రెండు మూడు సంస్థలు మినహా మిగతావేవీ అంచనా వేయలేకపోయాయి. గతంలో సర్వే సంస్థలు బీఆర్ఎస్కు అత్యధికంగా 70 స్థానాలు ఇవ్వగా కాంగ్రెస్కు 75 స్థానాలు ఇచ్చాయి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్కు 72 సీట్లు ఇవ్వగా కాంగ్రెస్కు 68 సీట్లు ఇచ్చాయి. మరీ దారుణంగా ఫ్లాష్టీం సర్వే అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 నుంచి 45 స్థానాలు వస్తాయని చెప్పగా కాంగ్రెస్కు 55 నుంచి 75 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. వాస్తవ ఫలితాలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా బీఆర్ఎస్కు 88 సీట్లు రాగా కాంగ్రెస్ 21 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఫ్లాష్టీం సర్వే పూర్తిగా తలకిందులైంది. ఇక జన్ కీ బాత్ సర్వే అంచనాలు కూడా తలకిందులయ్యాయి.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 50 నుంచి 65 సీట్లు, కాంగ్రెస్కు 38 నుంచి 52 సీట్లు వస్తాయని పేర్కొన్నది. కానీ ఆ సర్వే ఫలితాలు కూడా వాస్తవ ఫలితాల ముందు తేలిపోయాయి. న్యూస్ఎక్స్-నేత సర్వే సంస్థ గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 57 స్థానాలు ఇవ్వగా, కాంగ్రెస్కు 46 స్థానాలు ఇచ్చింది. సీ-ఓటర్ సర్వే బీఆర్ఎస్కు 48-60 సీట్లు ఇవ్వగా, కాంగ్రెస్ 47-59 సీట్లు గెలుస్తుందని తెలిపింది. కానీ ఈ సంస్థల సర్వేలేవీ నిజం కాలే దు. ఏ సర్వే సంస్థ కూడా ఫలితాలను సరిగ్గా అంచనా వేయలేకపోయింది. మరీ ముఖ్యం గా బీఆర్ఎస్ గెలిచే స్థానాలను అంచనా వేయడంలో మెజార్టీ సంస్థలు విఫలమయ్యాయి.
ఈ ఎన్నికల్లో గతంలో మాదిరిగానే సర్వే సంస్థల ఎగ్జిట్పోల్ ఫలితాలు తలకిందులవడం ఖాయమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది. గతంతో పోల్చితే ఈ ఎన్నికలు పూర్తి భిన్నంగా ఉన్నాయని, గత ఎన్నికల ఫలితాలనే అంచనా వేయలేని సంస్థలు ఈ ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేస్తాయనే నమ్మకం లేదంటున్నారు. మెజార్టీ సంస్థల సర్వే తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ పద్ధతి, ఫార్ములా లేకుండా సర్వేలు చేస్తున్నాయని, ఇది హడావిడి చేయడానికే తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఓటర్ నాడిని సర్వే సంస్థలు పట్ట లేకపోతున్నాయని అంటున్నారు. ఓటర్లు తమ అభిప్రాయాలేవీ సర్వే సంస్థలకు వెల్లడించడం లేదని, అలాంటప్పుడు సరైన అంచనాలు రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు తలకిందులవుతాయని చెప్తున్నారు.