హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy)ని మంత్రులు కేటీఆర్(Ministers KTR), హరీశ్ రావు కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని విస్తృత ప్రచారం నేపథ్యంలో మంత్రులు కలియడం ఆసక్తికరంగా మారింది. కాగా, రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగంకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కేటాయించలేదు.
దీనిపట్ల నాగం గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, జానా రెడ్డి లాంటి నేతల దృష్టికి తీసుకెళ్లినా టికెట్ పై హామీ దక్కలేదు. కాగా, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు, రాజేష్ రెడ్డికి ఆకస్మికంగా కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో ఆగ్రహానిక గురైన నాగం.. ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో అనుచరులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
చివరకు తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు నాగం స్పష్టత ఇచ్చారు.