ఆలేరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. సాగుకు కరెంటు విషయంలో డీకే చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ తీరు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉందన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన డీకే రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ కరెంటు విషయంలో సవాల్ చేశారని, ఆయన విసిరన సవాల్ హాస్యాస్పదంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
‘కేటీఆర్ మా గొప్పతనం మీకు తెలుసా..? మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నాం. కావాలంటే వచ్చి చూసుకో’ అని డీకే శివకుమార్ గొప్పలకు పోయిండని సీఎం విమర్శించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుంటే.. కర్ణాటకలో తాము 5 గంటల కరెంటు ఇస్తున్నామని శివకుమార్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు లేదన్నారు.
మోదీ సర్కారు రైతుల బావులకు కరెంటు మీటర్లు పెట్టాలని ఆర్డర్ వేసిందని, మోటార్లకు మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్లు కోత కోస్తమని హెచ్చరించిందని సీఎం చెప్పారు. రూ.25 వేల కోట్ల ఆదాయం తగ్గినా సరేగానీ మీటర్లు పెట్టేది లేదని తాను తెగేసి చెప్పానని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతాంగం బతుకులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయని, ఇలాంటి సమయంలో మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల దోచుకోవాలని చూడటం అన్యాయమని అన్నారు.