తుంగతుర్తి : తుంగతుర్తి మహిళా రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపిక, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని డీఆర్డీఏ ఆధ్వర్యంలో తుంగతుర్తి మహిళా సమాఖ్య ఉత్పత్తిదారుల ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం దళిత బంధు లబ్ధిదారుడు బొంకూరు భిక్షం నూతన ట్రాక్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఆసరా పింఛన్లు దేశంలోనే పేరుగాంచినవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.
మహిళలకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్థానిక తాసిల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ, ఐకేపీ ఏపీఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.