జహీరాబాద్, జూలై 21: ప్రాణాలు పోయినా సారవంతమైన భూములు నిమ్జ్ ప్రాజెక్టుకు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ బాధిత రైతులు స్పష్టం చేశారు. నిమ్జ్ ప్రాజెక్టు అధికారులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో నిమ్జ్ ప్రాజెక్టు కోసం సంబంధిత అధికారులు గ్రామంలో 1169 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు.
గతేడాది మార్చి 12న ఏర్పాటు చేసిన భూసేకరణ గ్రామ సభలో భూములు ఇచ్చేది లేదని అడ్డుకోవడంతో అధికారులు అర్ధంతరంగా సభ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి గ్రామ సభ ఏర్పాటు చేయకుండా అధికారులు 652 ఎకరాలకు జనరల్ అవార్డు పాస్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని భూముల రిజిస్ట్రేషన్ మూడేండ్లుగా నిలిపిశారని, బహిరంగ మార్కెట్లో పట్టాభూమికి ఎకరానికి రూ. 50 లక్షల వరకు ధర పలికితే, జనరల్ అవార్టు కింద చెల్లించే రూ. 15 లక్షల పరిహారంతో ఇంటిప్లాటు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టా భూములు ఇతరులకు అమ్ముకునేందుకు వీలు లేకుండా అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, బ్యాంకులో రుణాలు ఇవ్వకుండా ఆదేశాలు జారీచేయడం దారుణమని అన్నారు. దీంతో పిల్లల ఉన్నత చదువులు, పెండ్లిలు చేయలేని పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలుసార్లు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. నిరసనలో గ్రామ బాధిత రైతులు రాజిరెడ్డి, సంజీవ్రెడ్డి, బక్కన్న, వీరన్న, బిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.